బొంరాస్పేట, మార్చి 11: దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి వికారాబాద్ జిల్లాలో అనూ హ్య స్పందన లభిస్తున్నది. జనవరి 19వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. జూన్ వరకు నిర్వహించే రెండవ విడుత కంటి వెలుగులో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో ఉన్న వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి నెల నుంచి నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడింగ్ గ్లాసులను పంపిణీ చేస్తున్నారు. దూరపు చూపు సమస్య ఉన్న వారికి కండ్లద్దాలను ఆర్డర్ ఇచ్చి వచ్చిన తరువాత పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ మాత్రలు, కండ్లల్లో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు.
కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి రీడింగ్ గ్లాసులు అక్కడే పంపిణీ చేస్తుండగా, దూరపు కంటి చూపు ఉన్న వారికి ఆర్డర్ చేస్తున్నారు. ఆర్డర్ చేసిన అద్దాలకు బార్కోడ్ కేటాయిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 23,980 మందికి ప్రిస్క్రిప్షన్ కండ్లద్దాలు ఆర్డర్ ఇవ్వగా శనివారం నాటికి 10,950 మందికి పంపిణీ చేశారు. ఆశ కార్యకర్తలు వీటిని బార్కోడ్ ఆధారంగా పేషంట్ ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఇంకా 13030 ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంది. 31,898 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కంటి వెలుగు శిబిరాలలో 1,91,993 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 566గ్రామ పంచా యతీలు ఉండగా నేటి వరకు 203 గ్రామాలలో వైద్య బృందాలు పర్యటించి కంటి పరీక్షలు నిర్వహించారు. 33 గ్రామాలలో శిబిరాల నిర్వహణ ప్రగతిలో ఉండగా, ఇంకా 330 గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. నాలుగు మున్సిపాలిటీలలో 97 వార్డులు ఉం డగా ఈ రోజు వరకు 44 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. 6 వార్డుల్లో ఇంకా కొనసాగుతుండగా 48 వార్డుల్లో ఇంకా శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 1,36,115 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధ్దారించారు. కంటిచూపు సమస్యలు ఉండి అద్దాల అవసరం లేని వారికి చుక్క ల మందులు, విటమిన్ ఏ, డీ, బీ మాత్రలు అందజేస్తున్నారు.
నేడు 4490 మందికి కంటి పరీక్షలు
శనివారం జిల్లాలో 4490 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 491 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 443 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 217 గ్రామాలు, 45 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.