ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
49 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత
కొత్తూరు, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్లలకు వరం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదన్నారు. కొత్తూరు మండలంలోని గూడూరులో 11 మంది, ఇన్ముల్నర్వలో 8 మంది, కొడిచెర్లలో 5, కొత్తూరులో 8, మల్లాపూర్లో 4, షేరిగూడలో 2, సిద్దాపూర్ 7, తీగాపూర్లో 1, తిమ్మాపూర్లో 3 చొప్పున మొత్తం 49 మంది లబ్ధిదారులకు రూ. 49,05,684 విలువ చేసే చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే సమీక్షా సమావేశం
కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఇంటర్నెట్ పైప్లైన్ కోసం తీస్తున్న గుంతల వల్ల లక్షలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్డు ధ్వంసం అవుతుందన్నారు. కాంట్రాక్టర్లు తిరిగి రోడ్డు నిర్మించేంత వరకు వారికి బిల్లులు చెల్లించొద్దని ఎమ్మెల్యే దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారు. వివిధ సమస్యలను వివరించారు.