కడ్తాల్ : వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చరికొండ గ్రామంలో ప్రాథమిక సహకార కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని పేర్కొన్నారు. అన్నదాతలు ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.
ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 1960, బీ-గ్రేడ్ రకానికి రూ. 1940ని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ వీరయ్య, సర్పంచ్ భారతమ్మ, ఉప సర్పంచ్ నరేశ్, ప్యాక్స్ డైరెక్టర్లు అంజిరెడ్డి, చెన్నమ్మ, వెంకటయ్య, నాయకులు నర్సింహాగౌడ్, సాబేర్, యాదయ్య, జంగయ్య, మహావీర్, సాలయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.