ఉమ్మడి జిల్లాతో పెనవేసుకున్న ఉద్యమ జ్ఞాపకాలు ఎన్నో.. అనేక బహిరంగ సభల్లో పాల్గొని జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలంగాణ కాంక్షను పాటలతో ఉర్రూతలూగించిన వ్యక్తి ఇక లేడని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నది. జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం ఆయన మృతదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆయన చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు.
-రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ)
జిల్లా ప్రజలు కన్నీటిపర్యంతం
రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మరణించడాన్ని రంగారెడ్డి జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నది. జిల్లాలో నిర్వహించిన పలు సభల్లో సాయిచంద్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లాలో జరిగిన మలి దశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన ధూం ధాం కార్యక్రమాల్లో సాయిచంద్ పాల్గొని సబ్బండ వర్ణాలతో కలిసి కదం తొక్కారు. స్వరాష్ట్ర కాంక్షను ప్రజలకు అర్థమయ్యేలా కళాకారులతో కలిసి ఆడిపాడారు. కొంతకాలం క్రితమే జిల్లాలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, పెద్దఅంబర్పేటలో జరిగిన సభల్లోనూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. సాయిచంద్ తన కుటుంబ సభ్యులతో గుర్రంగూడలో నివాసం ఉంటుండడంతో ఈ ప్రాంత ప్రజలతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి సబితారెడ్డితోపాటు ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, ప్రకాశ్గౌడ్, సుధీర్రెడ్డి, కిషన్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కళాకారులు పెద్దఎత్తున తరలివచ్చి ఆశ్రునివాళులర్పించారు. సాయిచంద్కు ఉన్న స్మృతులను గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అంతిమయాత్రలోనూ పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. సాయిచంద్ మరణ వార్త తెలిసి మంత్రి సబితారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. సాయి చంద్ తనకు అత్యంత ఆత్మీయుడని, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరమన్నారు. ఏ కార్యక్రమంలోనైనా తనను అక్కా అని ఆప్యాయంగా పిలిచేవాడని అన్నారు. వ్యక్తిగతంగా, పార్టీపరంగా తీరని లోటని మంత్రి పేర్కొన్నారు.
అక్కల్లారా..అన్నల్లారా.. అన్న అతడి పిలుపునకు యావత్ ప్రజానీకం పులకరించిపోతుంది. అతడు పాట పాడితే సబ్బండ వర్ణాలు లయబద్దంగా ఆడుతాయి. గజ్జెకట్టి ఆడితే ముల్లోకాలు ఊగిపోతాయి. అతడి గొంతులో నుంచి వచ్చే గాన మాధుర్యంతో ఆబాల గోపాలం ఆడిపాడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏ సమావేశమైనా సరే ఆయన పాటతోనే మొదలయ్యేది. అలాంటి తెలంగాణ ఉద్యమ గళం మూగబోయింది. ప్రజలను జాగృతం చేసిన గాయకుడు, ఉద్యమకారుడు సాయిచంద్ హఠాన్మరణం యావత్ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ వెంట నడిచి తెలంగాణ కాంక్షను పాటలతో ఉర్రూతలూగించిన వ్యక్తి ఇక లేడని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మీయ నేత కడచూపు కోసం గురువారం గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి అశేష జనం తరలివెళ్లి నివాళులర్పించింది. మంత్రి సబితారెడ్డి అన్నీ తానై అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించగా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, అభిమానులు వీడ్కోలు పలికారు.
తెలంగాణ అభివృద్ధిలో తన గొంతుకతో మమేకం
వికారాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : సాయిచంద్ స్వయంగా రాసి పాడిన ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఉద్దేశించి పాడడంతో రాతి గుండెలాంటి మనుషుల్లో కూడా కన్నీళ్లు తెప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి 9 ఏండ్ల తెలంగాణ అభివృద్ధిలో తన గొంతుకతో మమేకమయ్యారు. గాయకుడు సాయిచంద్కు జిల్లాతోనూ అనుబంధం ఉంది. 2014, 2018 సార్వత్రిక ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కార్యక్రమంలో సాయిచంద్ పాలపంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు పాట రూపంలో తెలియజేశారు. ఎనిమిది నెలల క్రితం జరిగిన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలోనూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న సాయిచంద్ తన పాటలతో తొమ్మిదేండ్ల అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా చేశారు.
గొప్ప గాయకున్ని కోల్పోయాం : ఎమ్మెల్యే యాదయ్య
మొయినాబాద్, జూన్ 29 : తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ అకాల మరణం తెలంగాణ రాష్ర్టానికి తీరని లోటని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం హిమాయత్నగర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గొప్ప గాయకున్ని కోల్పోయామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ రాము, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ప్రజలను చైతన్యం చేసిన సాయిచంద్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్నగర్, జూన్ 29 : తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకాల మృతిపై ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ విచారం వ్యక్తం చేశారు. గురువారం గుర్రంగూడలోని సాయిచంద్ నివాసంలో పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. పాటలు పాడి ప్రజలను చైతన్యం చేశాడని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సహకార సంఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్ కూడా నివాళులర్పించారు.
సాయిచంద్ మృతి పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, జూన్ 29 : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ మృతిచెందడంతో గురువారం మండల పరిధిలోని కొడంగల్ తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతోపాటు ఆయా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సాయిచంద్ మృతి పార్టీకి తీరని లోటని, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించినట్లు ఎమ్మెల్యే నరేందర్రెడ్డి తెలిపారు. సాయిచంద్ మృతి వార్త బీఆర్ఎస్ నాయకులను కలవరపరిచిందని పేర్కొన్నారు. సాయిచంద్ స్వగృహంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ కూడలిలో సాయిచంద్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.
సాయిచంద్ హఠాన్మరణం రాష్ర్టానికి తీరనిలోటు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ఇబ్రహీంపట్నం, జూన్ 29 : ఉద్యమ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్రెడ్డి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. రాష్ట్రం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయిందని, ఆయన మృతి పార్టీతోపాటు తెలంగాణకు తీరని లోటని ఎమ్మెల్యే తెలిపారు.
సాయిచంద్ సేవలు అమోఘం ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, జూన్ 29 : తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ మృతిచెందడంతో, వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆనంద్ నివాళులర్పించారు. సాయిచంద్ పాడిన పాటలను స్మరించుకుంటూ, ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ అనంత్రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్గౌడ్, వెల్చాల్ సర్పంచ్ మధుసూదన్రెడ్డి, నాయకులు రవిశంకర్, సురేశ్ పాల్గొన్నారు.