ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనుండడంతో చాలామంది నిరుద్యోగులు కోచింగ్ తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పేద అభ్యర్థులను దృష్టిలో ఉంచుకున్న మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఉచితంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచి పేరున్న ప్రైవేటు కోచింగ్ సెంటర్ల వారితో అవగాహన కుదుర్చుకొని, తమ సొంత డబ్బులతో నిష్ణాతులైన వారితో కోచింగ్ ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు. శిక్షణ సమయంలో భోజన వసతితోపాటు ప్రత్యేక మెటీరియల్ సైతం ఉచితంగా అందజేయనున్నారు. ఉచిత శిక్షణపై నిరుపేద నిరుద్యోగ యువతీయువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వికారాబాద్, తాండూరు రెండుచోట్ల బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలుచోట్ల ఉచిత స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రకటించారు.
-ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 10
పరిగి, మార్చి 10: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసి నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేయగా… మరోవైపు ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన పిలుపుతో నిరుద్యోగులకు డబుల్ ధమా కా వరించనున్నది. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణతోపాటు, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక మెటీరి యల్ లభించనున్నది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలను ముమ్మరం చేశారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేదలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందించడంతోపాటు అనేక సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ఉచితంగా అంబులెన్స్లను అందించారు. వీటితోపాటు అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 80,039 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు అర్హత ఉన్న నిరుద్యోగులంతా ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎంత ఖర్చవుతుందని తీవ్రంగా ఆలోచిస్తున్నా రు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన చేసిన మరుసటి రోజే మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఉచితంగా కోచింగ్ సెంటర్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన పిలుపు మేరకు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు చర్యలు చేపట్టారు.
సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా ప్రభుత్వం రాష్ట్రంలోని 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేయనున్నది. ఇందులో జిల్లా కేడర్ పోస్టులు-738, జోనల్ పోస్టులు-5,297, మల్టీ జోనల్ పోస్టులు-6,370, గ్రూప్-1-పోస్టులు 503, గ్రూప్-2 పోస్టులు 582, గ్రూప్-3 పోస్టులు 1,373, గ్రూప్-4 పోస్టులు 9,168 ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. జిల్లా పరిధిలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నాలుగు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైతే అన్ని మండలాల వారికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే శిక్షణకు వచ్చేవారు వేలాది మంది ఉండే అవకాశం ఉండటంతో వారికి షిఫ్టుల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఉద్యోగార్థులకు ప్రత్యేకంగా భోజన వసతి కల్పించడంతోపా టు అవసరమైన మెటీరియల్ను కూడా ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం పేరొందిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులతో ఎమ్మెల్యేలు అవగాహన కుదుర్చుకుని, తమ సొంత డబ్బులతో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలను ముమ్మరం చేశారు. ఆర్థిక స్థోమత లేని వారికి, పేదలకు, వివాహిత మహిళలకు సువర్ణ అవకాశంగా పేర్కొనవచ్చు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉచితంగా కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు, చదువుకునేందుకు సమయం కూడా లభిస్తుంది. అదేవిధంగా జిల్లా పరిధిలో వికారాబాద్, తాండూరులో రెండుచోట్ల బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కళాశాల భవనాలను ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సైతం అంగీకరించారు. ఈ నేపథ్యంలో బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటైతే మరింత మంది నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందుతుంది.
ఇబ్రహీంపట్నం, మార్చి 10: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతో ఉద్యోగార్థుల కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు ఉచిత స్టడీ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజనం, అవసరమయ్యే మెటీరియల్ను పంపిణీ చేస్తామన్నారు. మండలానికి ఒకటి చొప్పున గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నిరుద్యోగులు లైబ్రరీలో చదువుకునేందుకు ఆదివారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంకేఆర్ ఫౌండేషన్లో శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 386 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.
ఉగాది పండుగ నుంచి ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభి స్తా. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలు పు మేరకు తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకులు ఈ కేం ద్రంలో ఉచితంగా శిక్షణ పొంది, పోటీ పరీక్షలకు సి ద్ధం కావాలి. ఈ అవకాశాన్ని నియోజకర్గంలోని యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ సెంటర్లో నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేస్తా.
-రోహిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నాలుగు ఉచిత స్టడీ సెంటర్లలో ఉద్యోగార్థులకు అన్ని సబ్జెక్టుల్లో సందేహాలను తీర్చేందుకు నిపుణులైన అధ్యాపకులను ఏర్పాటు చేస్తాం. ఈ ఫౌండేషన్లో శిక్షణ పొందిన వారిలో ఇప్పటికే 386 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించారన్నారు. ప్రస్తు తం ఏర్పాటు చేస్తున్న ఉచిత స్టడీ సెంటర్లను యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెం టర్ను ఏర్పాటు చేస్తా. వికారాబాద్ ప్రాంత నిరుద్యోగ యువతకు ఇదో మంచి అవకాశం. ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లను విడుదల చేయనున్నది. అందుకు అనుగుణం గా ఉద్యోగార్థులు సన్నద్ధం కావాలి. ఉచిత కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి.
-మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉద్యోగాలు భర్తీ కానుండటం తో యువత సంతోషంగా ఉంది. నిరుద్యోగులు తమ కల నెరవేరే సమయం వచ్చిందని సంబురాలు జరుపుకొంటున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని ఉద్యోగార్థులకో సం ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తా. పేదలు, ఆర్థిక స్థోమ త లేని వారు, వివాహితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలి.
– పట్నం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కొడంగల్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తా. అందులో వారికి ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంతోపాటు అవసరమైన మెటీరియల్ను కూడా అందించేలా చర్యలు తీసుకుంటా. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ఉద్యోగాలు సాధించాలి.
-కొప్పుల మహేశ్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడం సంతోషకరం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం నియోజకవర్గ కేంద్రాల్లో ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాల ని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు సూ చించడం అభినందనీయం. దీని ద్వా రా పేద విద్యార్థులకు ఆర్థికభారం తప్పుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకెళ్లి.. అక్కడ అద్దె గృహాల్లో ఉంటూ, కోచింగ్ సెంటర్లకు డబ్బులు ఖర్చుచేసే బాధ కూడా తప్పుతుంది.
-సుమిత్రాబాయి ఏం.ఏ, దేవులానాయక్తండా,
బొంరాస్పేట మండలం.
సీఎం కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించి నిరుద్యోగుల పాలిట దేవుడిగా మా రారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగుల సౌకర్యార్థం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని
ఎమ్మెల్యేలను ఆదేశించి పేద విద్యార్థులు ఉద్యోగాలను సాధించేలా మంచి అవకాశాన్ని కల్పించడం శుభపరిణామం. ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశం.
-రాఘవేందర్రెడ్డి, యాలాల
ఉద్యోగార్థుల సౌకర్యార్థం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు నిరుద్యోగులకు సువర్ణావకాశం లాంటిది. కొవిడ్ వైరస్ నేపథ్యంలో నిరుద్యోగులంతా ఆర్థికంగా ఇబ్బందులకు గురై పోటీ పరీక్షల ప్రిపరేషన్కు దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగా ల భర్తీకి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగులకు ఈ కోచింగ్ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
-మాసని వెంకటయ్య, ఎంఏ తెలుగు,
నాందార్పూర్, బొంరాస్పేట మండలం
నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తామనడం సంతోషంగా ఉంది. ఆర్థిక స్థోమత లేని నిరుద్యోగుల కోసం ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం అభినందనీయం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీయువకులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేకపోతారు. అలాంటి వారికి ఈ కోచింగ్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
-సుశీల, తాండూరు