పరిగి, జనవరి 6 : పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్లో శనివారం ఇస్తేమా ప్రారంభమైంది. ఇస్తేమాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం రాత్రి మొదలుకొని శనివారం ఉదయం వరకు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో ముస్లింలు ఇస్తేమాకు తరలివచ్చారు.
ఆయా ప్రాంతాల వారి వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇస్తేమాకు హాజరైన వారికి వలంటీర్లు సేవలు అందజేశారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఇస్తేమాలో పలువురి ప్రసంగాలతోపాటు ప్రార్థనలు చేశారు. ఇస్తేమా సోమవారం వరకు కొనసాగనున్నది. శనివారం ఇస్తేమా ప్రాంతంలో పోలీసు బందోబస్తును జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించి పర్యవేక్షించారు. ఇస్తేమా ప్రాంతంలో సదుపాయాలను డీపీవో తరుణ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు.