రంగారెడ్డి, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఈనెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారయంత్రాంగం పూర్తి చేసింది. ఈనెల 28న షురూ కానున్న మొదటి ఏడాది పరీక్షలకు 74,875 మంది, 29 నుంచి నిర్వహించనున్న ద్వితీయ ఏడాది పరీక్షలకు 74,191 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 195 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 8.45 నిమిషాల లోపే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణకు సెంటర్ ఇన్చార్జిలు, డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. అలాగే..ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలు కూడా సిద్ధంగా ఉండనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగనున్నాయి. 31 పోలీస్స్టేషన్లలో ప్రశ్నాపత్రాలను భద్రపర్చనున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులు త్వ రగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులను ఉదయం నుంచే నడిపేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నది.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పా ట్లు చేశారు. ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలు అందుబాటులో ఉండనున్నారు. నిరంతర విద్యుత్తును అందించనున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. పరీ క్షా సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. విద్యార్థులు తమ వెంట సెల్ఫోన్లను తీసుకురావొద్దని.. ఒకవేళ తీసుకొస్తే మొబైల్ పాయింట్ కేంద్రాల్లో ఉంచాలని డీఐఈవో శ్రీదేవి సూచించారు. మాస్ కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.