షాబాద్, నవంబర్ 22: ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసి పేద ల కు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటున్నది. పట్టణాలకు దీటుగా పల్లె దవాఖానలను తీర్చిదిద్ది వైద్యులు, సిబ్బందిని నియమించడంతోపాటు అవసరమైన మందులను
కూడా అందుబాటులో ఉంచుతున్నది. దవాఖానల్లో పేదలకు అందుతు న్న వైద్యసేవలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 44 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రభుత్వం ఒక్కో దవాఖానలో మూడు చొప్పున కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్నెట్కు అనుసంధానం చేసింది. వాటిని జిల్లా వైద్యాధికారితోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం వీక్షించేలా అనుసంధానం చేసింది. దీంతో వైద్య సిబ్బంది ఎంతసేపు.. ఏ విధంగా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారో సులువుగా తెలిసిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యసిబ్బంది పనితీరును అధికారులు పర్యవేక్షించనున్నారు. సర్కార్ నిర్ణయం తో పేదల వైద్యానికి మరింత భరోసానివ్వడంతో రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
44 పీహెచ్సీల్లో ఏర్పాటు..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్లు(కల్వకుర్తి)మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో ఉన్న 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభు త్వం ఇటీవలే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 11న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆన్లైన్ ద్వారా పీహెచ్సీల్లోని సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సి బ్బంది, వైద్యులు సకాలంలో దవాఖానలకు వచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టింది. ప్రజలకు 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రతి పీహెచ్సీలోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రతి పీహెచ్సీకీ మూడు చొప్పున కెమెరాలు
గ్రామీణ ప్రాంతాల పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి పీహెచ్సీలో మూడు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దవాఖానల్లోనూ ప్రైవేట్ దవాఖానలకు దీ టుగా వైద్యసేవలను అందించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి పీహెచ్సీలోనూ వైద్యుల గదితోపాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు గదుల్లో వీటిని బిగించారు. దీంతో వారు విధుల్లో ఎంతసేపు ఉంటున్నారు…? ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు.? అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చేందుకు వీలవుతుంది. కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా వాటి కి ఇంటర్నెట్కు అనుసంధానం చేశారు. దీంతో ఉన్నతాధికారులతో పాటు వైద్యారోగ్యశాఖ మంత్రి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. నిఘా వ్యవస్థలో పనిచేస్తున్నామని తెలిసి సిబ్బంది సైతం సక్రమంగా విధులను నిర్వహిస్తారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభు త్వం పీహెచ్సీలను పటిష్టం చేస్తున్నది.