కడ్తాల్, ఫిబ్రవరి 8 : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాల వారికే మేలు చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జడ్పీటీసీ దశరథ్నాయక్ నివాసంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా కేంద్రానికి సంవత్సరానికి రూ.1.25 వేల కోట్లు చెల్లిస్తే, కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించిందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, మన రాష్ట్రంలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించకపోవడమే కాకుండా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి గ్రీన్ ట్రిబ్యూనల్లో కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంలో కొన్ని మార్పులు తీసుకురావాలని మాట్లాడారన్నారు. ప్రతిపక్ష నాయకులు సీఎం కేసీఆర్ మాటలను వక్రీకరించి ప్రజలకు రెచ్చగొడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఉప సర్పంచ్లు రాజు, ముత్యాలు, రమణ, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్అలీ, సుభాశ్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు నర్సింహ, బాలకృష్ణ, నాయకులు శ్రీనునాయక్, టీకులాల్ పాల్గొన్నారు.