రంగారెడ్డి, ఫిబ్రవరి 16, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంపై మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3500 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకుగాను కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని హంగులతో అభివృద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. మొదటి విడుతలో 60 శాతం విద్యార్థులున్న పాఠశాలలను ఎంపిక చేసినట్లు మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాలను కల్పించే పనులకు సంబంధించి పారదర్శకంగా నిధులను ఖర్చు చేయాలని, నిర్వహణ కమిటీల ద్వారా రెండు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరువాలని, ఒకటి శాఖాపరమైన ప్రభుత్వ నిధుల కోసం, మరొక ఖాతా దాతల నుంచి సేకరించిన నిధుల కోసమని మంత్రి సబితారెడ్డి సూచించారు. మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే పనుల వివరాలన్నింటినీ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పొందుపరుస్తామన్నారు.
పనులు చేపట్టిన వాటికి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారని, చేపట్టే పనులకు సంబంధించి రికార్డులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో అన్ని ప్రక్రియలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని మంత్రి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 464 స్కూళ్లను ఎంపిక చేశామన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నీచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్బోర్డులు, పెయిటింగ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్హాళ్లులాంటి 12 అంశాలను గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంచనాలను రూపొందించాలన్నారు. మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహారీ నిర్మాణాలను ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టాలన్నారు. పాఠశాలల అవసరాలకు సంబంధించిన అంచనా, చెల్లింపులు లాంటి ప్రతి అంశం కమిటీల తీర్మానం ద్వారా చేపట్టాలన్నారు. సమావేశంలో కలెక్టర్ డి.అమయ్కుమార్, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్గౌడ్, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు జనార్ధన్రెడ్డి, యెగ్గె మల్లేశం, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు పాల్గొన్నారు.