రంగారెడ్డి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి రైతుల భూ హక్కులపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కత్తి పట్టుకుని సిద్ధంగా ఉంది. ‘ధరణి’తో భూములపై సర్వ హక్కులు కలగగా.. అధికార యావతో రైతు కుటుంబాల నోట్లో మట్టి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుంటున్నది. అన్నింటికన్నా ముఖ్యంగా కౌలుదారుల కాలమ్ను తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడం రైతులను ఆవేదనకు గురి చేస్తున్నది. ‘భూ మాత’ పేరుతో రైతులను బొంద పెట్టేందుకు చేస్తున్న కుట్రలపై రంగారెడ్డి జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. మళ్లీ పైరవీకారుల పెత్తనం వచ్చి రైతుల బతుకులు ఆగమవుతాయని విశ్లేషకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏండ్లనాటి రైతుల గోస తీర్చిన ‘ధరణి’కే మా మద్దతు అని రైతాంగం అంటున్నది.
‘ధరణి’ రాక ముందు భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండేవి. ఒక్కో రికార్డులో పదుల సంఖ్యలో కాలమ్స్ ఉండేవి. రాత పద్ధతిలో ఉండే ఆ రికార్డుల్లో అధికారులు ఇష్టారీతిన మార్పులు, చేర్పులు చేసేవాళ్లు. దీంతో విచ్చలవిడిగా అవినీతి జరిగేది. వాస్తవిక రైతుల భూములు వేరొకరి పేరు మీద రికార్డు అయి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడిగా తిరిగిన సందర్భాలు కోకొల్లలుగా ఉండేవి. దీంతో మనస్తాపం చెంది ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేశారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చి ‘ధరణి’ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు.
భూరికార్డుల నిర్వహణను అధికారుల చేతుల్లో నుంచి తీసేసి రైతు వచ్చి వేలిముద్ర వేస్తే తప్ప పట్టా మార్పిడి జరగని పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు అత్యంత సులభంగా తహసీల్దార్ కార్యాలయాల్లోనే జరుగుతున్నాయి. ధరణిలో ఉన్న భూ డేటా ఆధారంగానే రైతు బంధు, రైతు బీమా, పంట కొనుగోళ్లు వంటి పథకాలను అమలు చేసి ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తూ వస్తున్నది. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు ‘ధరణి’ని తీసేసి భూ మాత పోర్టల్ను తీసుకొస్తే రైతులు ధరణి ద్వారా పొందుతున్న ప్రయోజనాలన్నింటికీ దూరం కావాల్సి వస్తుంది. పట్వారీల వ్యవస్థ రావడం వల్ల రైతులు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.
భూ రికార్డుల విప్లవాత్మక సంస్కరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాత పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. గతంలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్లలో 20 కాలమ్స్ ఉండగా సీఎం కేసీఆర్ వాటన్నింటికీ చరమగీతం పాడారు. కౌలు కాలమ్ను తీసేసి హక్కుదారు కాలం మాత్రమే ఉంచి రైతులకు భూములపై సర్వ హక్కులు కల్పించారు. అధికారంలోకి వస్తే కౌలు కాలమ్ను తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతుండడంతో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. భూములపై రైతుల హక్కులను కాలరాజేసేందుకు కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్పై కన్నెర్రజేస్తున్న రైతాంగం బీఆర్ఎస్కే మద్దతుగా నిలుస్తామని పేర్కొంటున్నది. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానీ భూసమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. సర్కార్ కౌలుదారు గడిని రికార్డును తొలగించడం సంతోషకరం, కానీ, కాంగ్రెస్ నాయకులు మరలా కౌలుదారు కాలం తీసుకొస్తాం.. ధరణిని ఎత్తివేస్తాం అని చెబుతున్నారు. దీంతో మళ్లీ భూ సమస్యలు వస్తాయి.
ధరణిని తీసివేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది. గతంలో భూమి అమ్మాలన్నా, కొనాలన్నా రోజంతా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండవలసి వచ్చేది. మొన్న మా కూతురు పెండ్లి కోసం భూమి అమ్మగా.. ఒక గంటసేపట్లో నే పనంతా అయిపోయింది. ధరణిని తీసివేసి పాత పరిస్థితులు తెచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది.
ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదు. ఎలాంటి లంచం ఇవ్వకుండా, పైరవీకారులను సంప్రదించకుండా భూముల సమస్యలను సులభంగా పరిష్కరించుకున్నాం. గతంలో అధికారులు, పట్వారీలు చేసిన అనేక తప్పిదాలతో రైతులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు.
– సిందం అంజయ్య, మేడిపల్లి యాచారం మండలం
పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకువచ్చారు. గతంలో ఎవరు డబ్బులిస్తే వారి పేర్లపై భూముల రికార్డులు తారుమారు చేసేవారు. ఎమ్మార్వో కార్యాలయాల్లో పైరవీకారుల రాజ్యం నడిచేది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామనడం సరికాదు.
కాంగ్రెస్ నేతలు ధరణిని రద్దు చేసి పాత విధానాన్ని తీసుకొస్తామని అనడంలో వారి అవివేకం కనిపిస్తున్నది. కాంగ్రెస్ నేతలు భూ మాత పోర్టల్ను ప్రవేశపెడితే మళ్లీ రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సిందే.. దళారీ వ్యవస్థ వచ్చి భూ సమస్యలు పెరుగుతాయి.
– శ్రీశైలం, రైతు, దేవునిఎర్రవల్లి (చేవెళ్ల)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములు కొనాలన్నా.. అమ్మాలన్నా.. రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇవ్వాల్సి వస్తది. పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ధరణి తీస్తేస్తే ఒకరి భూమి మరొకరి పేరు మీద రాయించుకునే రాక్షస రాజ్యం తయారవుతుంది.
– వెంకటయ్య, మహాలింగాపురం, శంకర్పల్లి
ధరణి ద్వారా అంతా ఆన్లైన్ చేయడంతో భూమికి భద్రత ఉంది. అప్పట్లో రికార్డుల్లో రాసే వారు. పట్వారీలకు లంచం ఇస్తే ఒకరి భూమి ఇంకొకరికి రాసే ఇచ్చేవారు. కబ్జా కాలంలో కౌలుదారుడి పేరు రావడంతో పట్టాదారుడికి భూమికి రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పట్టాదారుడు, కౌలుదారుల మధ్య గొడవలు తలెత్తుతాయి.
– మేకల రామచంద్రయ్య,రైతు, సురంగల్, మొయినాబాద్
కాంగ్రెస్ పాలనలో భూముల సమస్యల పరిష్కారానికి సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్లం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. ధరణిని తీసేస్తామని చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలి.
– కృష్ణారెడ్డి, ఎలిమినేడు (ఇబ్రహీంపట్నం)
ధరణి వచ్చాక రైతుల భూములకు రక్షణ ఏర్పడింది. వేలి ముద్ర, సంతకం లేనిదే రైతు పేరు మీద ఉన్న భూమి వేరొకరికి మారదు. ఎలాంటి లంచాలు, మధ్యవర్తులు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనం.
-మంగల్పల్లి నర్సింహ, కడ్తాల్ మండలం
గతంలో పహాణీల్లో వీఆర్వోలు పేర్లు మార్చేవారు. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్ ప్రవేశపెట్టి డిజిటలైజేషన్ చేసిన వేలిముద్ర వేస్తే తప్ప రికార్డులు మారవు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని అనడం సరికాదు.
– నాగిళ్ల జగన్ ,ఆమనగల్లు
ధరణిని తీసివేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ధరణిని రద్దు చేసి పాత రెవెన్యూ రికార్డును మళ్లీ ఏర్పాటు చేస్తే పట్టాదారు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతు బీమా డబ్బులు రావు. బ్యాంకు రుణాలకు మధ్యవర్తుల అవసరం వస్తుంది.