వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్గృహకల్ప పక్కన గల ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాత్రికి రాత్రే సంబంధిత ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తుండడం గమనార్హం. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ప్రభుత్వ భూమి కబ్జా విషయం వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఒకరిద్దరికి నోటీసులిచ్చి చేతులు దులుపుకొన్నారు. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి నెల రోజులు దాటినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోయినా రెవెన్యూ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు సంబంధిత ప్రభుత్వ స్థలంలో అక్రమాలను అడ్డుకోకపోవడంతో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
వికారాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి సర్వే నంబర్ 290, 291, 292లలో 27 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. సంబంధిత భూమి నుంచి 4 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించగా మిగతా 23 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది. సంబంధిత ప్రభుత్వ భూమిలో దాదాపు మూడున్నర ఎకరాల వరకు కబ్జాకు పాల్పడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దాని విలువ మార్కెట్లో రూ.10 కోట్ల వరకు ఉంటుంది.
2009లో ఇదే ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేపట్టారని అప్పటి వికారాబాద్ సబ్ కలెక్టర్లు దాదాపు 56 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు అప్పట్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ దృష్టి సారించి సంబంధిత అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి సర్వే నంబర్ 290, 291, 292లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు మరో శాఖపై ఆరోపణలు చేస్తూ పరోక్షంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇండ్లకు సంబంధించి వికారాబాద్ మున్సిపల్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలకు అనుమతులను మున్సిపల్ అధికారులే ఇస్తున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
బోగస్ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిసింది. అసలు కబ్జాదారుల వద్ద ఉన్న పట్టాలు నిజమైనవా లేదనే విషయమై మున్సిపల్ అధికారులు ఎలాంటి విచారణ చేయకపోవడం గమనార్హం. ఇదే అదునుగా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ, అక్రమ నిర్మాణాలకు అనుమతులతోపాటు ఇంటి నంబర్ను కేటాయిస్తున్నట్లు తెలిసింది.
ఇదే విషయమై ఓ మున్సిపల్ అధికారిని ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ వివరణ తీసుకోగా, ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా మేం ఇంటి నంబర్ జారీ చేస్తామని చెప్పడం గమనార్హం. మరోవైపు అక్రమ నిర్మాణాదారులకు నోటీసులిచ్చి నెలరోజులు దాటినా వారి వద్ద ఉన్న పట్టాలు రెవెన్యూ అధికారులకు అందజేయకపోయిన ప్పటికీ అక్రమ నిర్మాణాలను చూసిచూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ నిర్మాణాలను చేపట్టిన వారిలో 25 ఇండ్లకు సంబంధించి నోటీసులు జారీ చేశాం. పట్టాలున్నాయని చెప్పారు, పట్టాలు తీసుకురావాలని మరో పది రోజులు అవకాశమిచ్చాం. అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేస్తున్న మున్సిపల్ అధికారులపై కేసులు నమోదు చేయాలి… కానీ, మరో శాఖపై చర్యలు తీసుకోలేం. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో వెనుకడుగు వేసేదేం లేదు,
– లక్ష్మీనారాయణ, వికారాబాద్ తహసీల్దార్