ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటకులను కనువిందు చేసే విధంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినందున బుధవారం ఆయన టూరిజం, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరానికి ఇబ్రహీంపట్నం అతి చేరువలో ఉన్నందున ఈ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చి సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతే ఈ ప్రాంతవాసులతో పాటు నగరశివారు ప్రాంతాలకు చెందిన అనేకమంది ఈ చెరువు ప్రాంతానికి వచ్చి సేదతీరటంతో పాటు ఆహ్లాదాన్ని పంచుకుంటారని ఆయన అన్నారు.
ఇందుకోసం ప్రతి సంబంధిత అధికారి తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. చెరువు కట్ట పొడవున ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చెరువు కట్టను వెడల్పు చేసి పర్యాటకులు కూర్చునే విధంగా తీర్చిదిద్దాలని, అలాగే, చెరువుకట్ట ఇరువైపులా పూలమొక్కలను పెంచి పర్యాటకలను ఆకర్షించే విధంగా తయారు చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు తూమువద్ద ఇప్పటికే వందలాదిమంది పర్యాటకులు వచ్చి సేదతీరుతున్నారని దీనిని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం చెరువు పక్కన పోచారం రోడ్డులో చక్కటి పార్కును రూపొందించాలన్నారు.
ఈ పార్కులో అందమైన మొక్కలను నాటి ఇంటిల్లిపాది వచ్చి రోజంతా గడిపే విధంగా అభివృద్ధి చేయాలని టూరిజం అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే, చెరువులో పర్యాటకులు సేదతీరేందుకు బోట్, రెస్టాంట్ తరహాలో మరో బోట్ ఏర్పాటు చేయాలని ఆయన ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం చెరువుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, అలాగే, చెరువు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాశ్వత కట్టడాలు లేకుండా చెరువును సుందరీకరణ చేసే కార్యక్రమాన్ని మాత్రమే చేపడుతున్నామన్నారు. ఇందులో ఎవరు ఎలాంటి అపోహలకు గురికావద్దని, కేవలం ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో వాకింగ్ పార్కును కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ సౌకర్యం కల్పించే విషయంపై త్వరలోనే టూరిజం ఎండీ, ఇరిగేషన్ ఉన్నతాదికారులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నంకు తలమానికమైన పెద్దచెరువు అభివృద్ధి చెందితే ఇబ్రహీంపట్నం భవిష్యత్లో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ యూసఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, ఇరిగేషన్, టూరిజం అధికారులు పాల్గొన్నారు.