ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలల్లోని 79 గ్రామాలతో పాటు అబ్దుల్లాపూర్మెట్ మండలంలో అనుబంధ గ్రామాలను కలుపుతూ పూర్తిగా 81 గ్రామస్థాయి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కమిటీలను ఎన్నుకున్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం, తుర్కయంజల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని 87వార్డు కమిటీలను కూడా ఇప్పటికే పూర్తి చేసి పార్టీ నాయకులు ఎమ్మెల్యే కిషన్రెడ్డికి అందజేశారు.
వార్డు స్థాయితో పాటు గ్రామ కమిటీలు పూర్తయినందున ఎమ్మెల్యే మండలస్థాయి, మున్సిపల్స్థాయి కమిటీలపై దృష్టి సారించారు. నూతనంగా గ్రామాల్లో ఎన్నికైన కమిటీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే దిశగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని 4మండలాలు, 4 మున్సిపాలిటీల టీఆర్ఎస్ కమిటీలను ఎన్నుకునేందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఈ నెల 19న ముహూర్తం ఖరారు చేశారు. పార్టీకోసం కష్టపడి పని చేసే నాయకులకే మండల కమిటీల్లో స్థానం కల్పించే విధంగా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.