ఇబ్రహీంపట్నం, జూన్ 7 : నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువు మరమ్మతులపై పాలకులు శ్రద్ధ చూపకపోవటంతో చెరువులోకి నీరొచ్చే కాల్వలు మూసుకుపోయాయి. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పూర్తిగా ఎండిపోయింది. నలభై ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కింద 1250 హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఉప్పరిగూడ గ్రామాల మత్స్యకారులకు ప్రధాన ఆదాయం ఇస్తుంది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఆయకట్టు ఎడారిగా మారింది. మత్స్యకారుల ఉపాధి పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరొచ్చే ప్రధానమైన పెద్దవాగు, రాచకాల్వలను మరమ్మతుకు ప్రభుత్వం రూ.16 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో 35 కిలోమీటర్ల పొడవుగల పెద్దవాగును పూర్తిస్థాయిలో మరమ్మతు చేశారు. దీంతో కందుకూరు మండలంలోని ఎగువభాగంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి ఇటీవల కురిసిన వర్షాలకు నీరు పెద్ద ఎత్తున చెరువులోకి చేరింది. 15 రోజులపాటు పెద్దచెరువు పొంగిపొర్లింది. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 చెరువుల్లో భూగర్భజలాల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఎండిపోయిన బోరుబావులన్నీ వినియోగంలోకి వచ్చాయి. ప్రభుత్వం తరపున మత్స్యకారులు పెద్ద ఎత్తున చేపపిల్లలను వదిలారు.
చెరువుల సుందరీకరణ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయటంతో గతంలో ఎలాంటి ఆదరణకు నోచుకోని తుర్కయాంజాల్ మాసబ్చెరువు ఎంతో సుందరంగా తయారైంది. ప్రస్తుతం ఈ చెరువుకట్ట సుందరీకరణ వలన పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడకు చేరుకుని సేదతీరుతున్నారు.
షాబాద్: గతంలో చెరువులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో కురిసిన కొద్దిపాటి వర్షాలకు చెరువులు గండ్లు పడి నీరంతా వృథాగా పోయేది. స్వరాష్ట్రంలో అందుకు భిన్నంగా మారింది. మండు టెండల్లో సైతం చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. చెరువు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతుల బోరుబావుల్లో నీరు పుష్కలంగా వచ్చింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు ప్రస్తుతం మండుతున్న ఎండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలోనే మొదటి విడతలో ఈ చెరువును మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు రూ. 7కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో చెరువును పూడీక తీసి చెరువుకట్టను అభివృద్ధి చేశారు. సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కింద షాబాద్, కేశవగూడ, సంకెపల్లిగూడ, శేరిగూడ, పటేల్గూడ, ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడ గ్రామాలకు చెందిన 200 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ చెరువులో ఉన్న నీటితో చుట్టుపక్కల కొత్తూర్, చేవెళ్ల, శంషాబాద్ తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల రైతుల బోరుబావుల్లో కూడా నీటిమట్టం పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. షాబాద్ మండల కేంద్రంలోని పహిల్వాన్ చెరువు కట్టపై తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
షాద్నగర్ ః మిషన్ కాకతీయ పథకంలో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. ఉమ్మడి పాలనలో కలుపు మొక్కలు, చెత్తకుప్పలతో తలపించిన చెరువులు నేడు జల కళను సంతరించుకున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాల్లో 460 చెరువులు, కుంటలు ఉన్నాయి. సుమారుగా 13 వేల 265 ఎకరాల చెరువులకు సాగు ఆయకట్టు ఉంది. ఫరూఖ్నగర్, చౌదరిగూడ, కొందుర్గు, కేశంపేట మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు చెరువులపై ఆధారపడి పటంలను సాగు చేస్తుంటారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు దశలో 215 చెరువులను రూ. 32.54 కోట్ల నిధులతో బాగుచేసి వాడుకలోకి తెచ్చారు. చెరువుల్లో పూడికతీతో పాటు కట్టలను బలోపేతం చేశారు. ముండ్ల చెట్లను తొలగించి తూములను అభివృద్ధి చేశారు. ఫలితంగా వర్షం నీళ్లతో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి. షాద్నగర్ మున్సిపాలిటీ శివారులోని బొబ్బిలి చెరువును మిని ట్యాంక్ బండ్ చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయించి బాగుచేశారు. ఒకప్పుడు చెత్త కుప్పలు, ముండ్ల పొందలతో కనిపించే చెరువులు నేడు ట్యాంక్ బండ్ను తలపించేలా బాగుచేశారు. చెరువు కట్టపై మట్టిని పోసి ఫుట్పాత్ను తయారు చేశారు. బతుకమ్మలను వేసేందుకు ఘాట్లను ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసిన చెరువులతో ఈ యేడు సుమారు 4.6 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
ఆమనగల్లు ః ఆమనగల్లు మండలంలో ఉన్న 12 చెరువుల్లో మిషన్ కాకతీయ పథకంతో మండుటెండల్లో కూడా నీటితో కళకళలాడుతున్నాయి. సురసముద్రం చెరువుతో పాటు మండలంలోని అన్ని చెరువులకు గత పాలకులు ఎలాంటి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు.
మొయినాబాద్ : మిషన్ కాకతీయ వల్ల మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ పెద్ద చెరువు, చిలుకూరు పెద్ద చెరువు, చిలుకూరులోని బొబ్బిలికుంట, పెద్దమంగళారం పెద్ద చెరువు, చిన్నమంగళారంలోని పెద్ద చెరువు, నాగిరెడ్డిగూడలోని అబుకుంట, నక్కలపల్లిని చెరువు, బంగాలిగూడలోని బంగాలిచెరువు, అమ్డాపూర్లోని పటేల్కుంట, మేడిపల్లిలోని కుమ్మరి కుంట చెరువునుల మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించారు. దీంతో నేడు చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి.