ఇబ్రహీంపట్నం, జూన్ 7 : కాకతీయుల కాలాన్ని తలపించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టి సాగునీరు, తాగునీటికి ఇబ్బందిలేకుండా చేశారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిషన్కాకతీయ ద్వారా గొలుసుకట్టు చెరువుల మరమ్మతుతో పాటు చెరువులకు నీరందించే కాల్వల మరమ్మతులు చేపట్టారని వివరించారు. దీని ఫలితంగా ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు నిండి సాగునీటి సమస్య తీరిందని అన్నారు.
మిషన్ కాకతీయలో భాగంగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరందించే ప్రధానమైన పెద్దవాగు మరమ్మతుకు ప్రభుత్వం రూ.16కోట్లు కేటాయించిందని అన్నారు. 39కిలోమీటర్ల పొడవుగల పెద్దవాగును పూర్తిస్థాయిలో మరమ్మతు చేయటం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దవాగు నుంచి పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం చెరువుకు చేరిందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 1639అడుగుల ఎత్తులో ఉండటం వలన గతంలో సాగునీరు, తాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారని, ఏటా కరువుతో రైతులు, ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురయ్యేవారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో తాగు, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో శివన్నగూడ రిజర్వాయర్ నుంచి 30వేల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే బృహత్ పథకానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ్దం చేసిందన్నారు.
గ్రంథాలయ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువులు, కుంటల మరమ్మతుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించటం వల్ల ప్రస్తుతం చెరువులు జలకళ ఉట్టి పడుతున్నదన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, సర్పంచ్లసంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పెద్దఅంబర్పేట్ మున్సిపల్ కౌన్సిలర్ సిద్దంకి కృష్ణారెడ్డి, ఇరిగేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ సీహెచ్ సునిత, ఇబ్రహీంపట్నం డీఈ ఉషారాణి, ఏఈలు రాజ్యలక్ష్మి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
షాద్నగర్ : దేశానికే అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ వర్ధిల్లుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం షాద్నగర్ పట్టణంలోని కింగ్ ప్యాలెస్లో నిర్వహించిన సాగునీరు దినోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని అన్ని ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ రాష్ర్టాన్ని పంటలకు నిలయంగా మార్చారని అన్నారు. రూ. 5.4 వేల కోట్ల నిధులతో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా గ్రామాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు కృష్ణానీళ్లతో పాటు మల్లన్నసాగర్ ద్వారా గోదావరి నది జలాలను కూడా అనుసంధానం చేసి షాద్నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. షాద్నగర్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ ద్వారా సుమారు 200కు పైగా చెరువులను రూ. 32.54 కోట్ల నిధులతో బాగుచేశామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీలు తాండ్ర విశాల, శ్రీలత, బంగారు స్వరూప, నందిగామ ఎంపీపీ ప్రియాంక, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, ఇరిగేషన్ ఈఈ మాధవి, డీఈఈ అరుణకుమారి, డీఈ సత్యనారాయణ, ఏఈలు రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, తహసీల్దార్ గోపాల్, నాయకులు పాల్గొన్నారు.