ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు సంబరాల్లో భాగంగా మూడోరోజు జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుకు సంబంధించిన ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు ముగ్గులు వేసి రైతుబంధు విశిష్టతను తెలియజేస్తూ వేసిన ముగ్గులు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆకర్షించాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి బహుమతులు అందజేశారు.
అలాగే, మంచాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు పెద్ద ఎత్తున రైతుబంధుకు సంబంధించిన ముగ్గులను వేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విద్యార్థులు తీర్చిదిద్దిన ముగ్గులను తిలకించి అనంతరం వారికి బహుమతులు అందజేశారు. అలాగే, షాబాద్ మండల కేంద్రంలో జడ్పీటీసీ పట్నం అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆమనగల్లు మండల కేంద్రంలోని మార్కెట్యార్డులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రైతుబంధు ప్రాముఖ్యతను తెలిపే ముగ్గులను వేశారు. అనంతరం వారికి అధికారులు బహుమతులు అందజేశారు.
అలాగే, జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో రైతుబంధుపై విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, పోటీలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రెండు విడుతలుగా పెట్టుబడి సహాయం అందజేయటం వలన వ్యవసాయం దండుగ అనుకున్న రైతులు నేడు వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. రైతుబంధు ద్వారా లబ్ధిపొందిన ప్రతిరైతు ముఖ్యమంత్రికి బాసటగా నిలువాలన్నారు.