హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 7 : హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సత్రం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్బాబు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జేఎన్ఎస్ వేదికగా తొలి సారిగా కిడ్స్ విభాగంలో క్రీడలు చేపట్టగా, పలు జిల్లాల నుంచి చిన్నారులు హాజరై పోటీతత్వాన్ని ప్రదర్శించడంతో ప్రేక్షకులు, క్రీడాభిమానులు ఆసక్తిగా తిలకించారు.
రెండురోజుల పాటు నిర్వహించే అండర్-6 (కిడ్స్) అండర్-8, 10, 12, 14, 16, 18, 20 బాలబాలికల, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అండర్-18 (యూత్) బాలబాలికలు సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో నిర్వహించే 21వ జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారు. తొలి రోజు నిర్వహించిన పోటీల్లో విజయం సాధించిన విజేతలకు అతిథులు, నిర్వాహకులు మెడల్స్, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, టెక్నికల్ కమిటీ చైర్మన్ జగన్, సెలక్షన్ కమిటీ చైర్మన్ పగడాల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ఏపుగా పెరిగిన గడ్డి, పిచ్చిమొక్కలు
అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేనితనంతో జేఎన్ఎస్లోని సింథటిక్ ట్రాక్ మధ్యలో, చుట్టు పక్కన పిచ్చిమొక్కలు, గడ్డి ఏపుగా పెరిగింది. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరుగుతున్నా అధికా రులు శుభ్రం చేయించకపోవడంతో జావెలిన్త్రో, షాట్పుట్ అథ్లెట్లకు ఇబ్బందులు తప్పలేదు. ఇదేం ట్రాకని అథ్లెట్లు, టెక్నికల్ అఫీషియల్స్, అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. వాకింగ్ చేసే క్రమంలో పాములు, తేళ్లు, పురుగులు సైతం వచ్చినా క్లీన్ చేయడం లేదని వాకర్లు వాపోతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుల తల్లిదండ్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.