హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాలపై మీటింగ్ పెట్టాలంటూ ఏపీ లేఖ రాసిందే తడవుగా జీ హుజూర్ అంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధమైంది. తెలంగాణను సంప్రదించకుండానే ఉ మ్మడి ప్రాజెక్టుల నీటి వినియోగాలపై 13న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏకపక్షంగా ప్రకటించింది. ఆ రోజు త్రీమెన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ ఇరు రాష్ర్టాలకు శుక్రవారమే లేఖలు రాశారు. ఏపీ ఆదేశించిన విధంగానే ప్రస్తుతం శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటినిల్వలు, రాష్ర్టాల నీటి అవసరాలపై మాత్రమే చర్చించే సింగిల్ ఎజెండాను ఖరారు చేసింది. జలసౌధలో మెంబర్ సెక్రటరీ కార్యాలయంలో 13న ఉదయం11 గంటలకు మీటింగ్ కొనసాగుతుందని, ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు హాజరుకావాలని మెంబర్ సెక్రటరీ ఆ లేఖలో పేర్కొన్నారు.
నిరుడు నీటి సంవత్సరం ఆఖరి నెల వరకూ, అదీ తెలంగాణ పలుమార్లు కోరినా సమావేశాన్ని మాత్రం బోర్డు ఏర్పాటు చేయనేలేదు. నీళ్లన్నీ అయిపోయాక మీటింగ్ పెట్టి మమ అనిపించడం గమనార్హం. ఆది నుంచీ కృష్ణా జలాల మళ్లింపునకు ఏపీకి పరోక్షంగా బోర్డు అండదండలు అందిస్తున్నదనే విమర్శ లున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఇండె ంట్లు, అనుమతులు లేకుండానే ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపును ఇప్పటికే చేపట్టింది. ఉన్నపళంగా 2026-27 నీటి సంవత్సరానికి సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి కేవలం జలాల వినియోగ అంశంపైనే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ 4వ తేదీన సాయంత్రమే కేఆర్ఎంబీ చైర్మన్కు ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు. లేఖ అందినదే తడవుగా జీహుజూర్ అంటూ ఆగమేఘాల మీద కేఆర్ఎంబీ సైతం అందుకు సిద్ధమైంది.
వాస్తవంగా రివర్ బోర్డులో రాష్ర్టాలదే నిర్ణయాధికారం. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయంతోనే బోర్డు వ్యవహరించాల్సి ఉంటుంది. సమావేశాలు, తదితర అంశాలపై ఏదైనా కొత్త ప్రతిపాదనలు, అభ్యంతరాలను ఏ రాష్ట్రమైనా లేవనెత్తితే ముందుగా మరో రాష్ట్రం అభిప్రాయం కోరాలి. అప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోతే ఆ రాష్ర్టాలను సంప్రదించి, ఎజెండా అంశాలను కోరి, తదుపరి ఇరు రాష్ర్టాలకు అంగీకారయోగ్యమైన తేదీనే మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, కేఆర్ఎంబీ అందుకు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తున్నది. అడుగడుగునా ఏపీకి అనుగుణంగానే, అనుకూలంగానే వ్యవహరిస్తూ, ఆ మేరకే నిర్ణయాలు తీసుకొంటున్నది. ఏపీ లేఖ రాసిన వెంటనే, కనీసం తెలంగాణ అభిప్రాయాన్ని కోరకుండానే, కనీసం సంప్రదించకుండానే ఏకపక్షంగా త్రీమెన్ కమిటీ సమావేశ తేదీని ప్రకటించడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
ఏపీ హడావుడిగా మీటింగ్ పెట్టాలని కో రడం, బోర్డు సై అంటూ సిద్ధమవడం ఇ ప్పుడు చర్చనీయాంశంగా మారింది. వి ద్యుదుత్పత్తి చేపట్టకుండా తెలంగాణను ని రోధించి, పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను మళ్లించే కుట్రతోనేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. వాస్తవంగా రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను త్రీ మెంబర్ కమిటీ పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటివాటాలను కేటాయిస్తుంది.
కానీ, ఈ ఏడాది ఇప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టునే పూర్తిగా నిండలేదు. హడావుడి మీటింగ్ పెట్టడంలో ఆంతర్యం వెనుక కేవలం పోతిరెడ్డిపాడుకు నీటిని మళ్లించడం కోసమేనని తెలుస్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను మళ్లించాలంటే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు ఉండా లి. ప్రస్తుతం 873 అడుగులకు చేరుకొన్న ది. శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ ఆ జలాలను సాగర్కు విడుదల చేయాలి. తెలంగాణ విద్యుదుత్పత్తి చేపడితే శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోతుంది. దీంతో పోతిరెడ్డిపాడుకు నీటి మళ్లింపునకు బ్రేకులు పడుతాయి. ముందుగానే మీటింగ్ పెట్టి తెలంగా ణ విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధించడ మే లక్ష్యంగా ఏపీ మీటింగ్కు డిమాండ్ చేయడం, బోర్డు సిద్ధమవడం అందులో భాగమేనని తెలిసిపోతున్నది.