ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది. ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మంచిరెడ్డి ప్రజల మన్ననలు పొందడంతో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడనున్నది. ఐదేండ్ల కాలంలోనే అక్షరాలా రూ.2,931కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రత్యేక కృషితో ఒకప్పటి ఉద్యమాల గడ్డపై నేడు పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్నది. ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాల్లో రూ.6,982.85కోట్ల పెట్టుబడులతో 173 పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఎంతో మందికి ఉపాధి లభించింది. కొంగరకలాన్లో కలెక్టరేట్ ఏర్పాటుకాగా జిల్లా ప్రజలకు పాలన చేరువైంది.
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కుల వృత్తులకు చేయూత తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సబ్బండ వర్ణాలకు అందుతున్నాయి. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణతో పాటు పార్కుల ఏర్పాటుతో సర్వాంగ సుందరంగా మారాయి. ‘మిషన్ భగీరథ’తో ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నది. దవాఖానలను అప్గ్రేడ్ చేయడంతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందడంతో నియోజకవర్గ రూపురేఖలు మారాయి. మళ్లీ మంచిరెడ్డి బరిలో నిలువగా జైకొట్టి గెలిపించుకునేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు.
– రంగారెడ్డి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పోరాటాలకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గం వేదికగా నిజాం వ్యతిరేక పోరాటాలు, సాయుధ తెలంగాణ పోరాటాలెన్నో పురుడుపోసుకున్నాయి. ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో నేడు పారిశ్రామిక ప్రగతి వెల్లివిరుస్తున్నది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఇక్కడకు తరలివస్తుండడంతో ఈ నియోజకవర్గం పేరు మరింత ప్రాచుర్యం పొందింది. 2009 నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.
సంక్షేమ పరంగానే గాకుండా ప్రగతిపథంలోనూ దూసుకుపోతున్నది. ఈ సెగ్మెంట్ పరిధిలోని కొంగరకలాన్లో రంగారెడ్డి కలెక్టరేట్ ఏర్పాటుకాగా.. రహదారుల విస్తరణ, అన్నిరకాల మౌలిక వసతులు పల్లెపల్లెకూ చేరాయి. గతంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఈ నియోజకవర్గంలో సమూల మార్పులు జరిగి గణనీయమైన ప్రగతి కనిపిస్తున్నది. ఇప్పటికే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందిన మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలబడి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజానీకం సైతం మరోసారి మంచిరెడ్డిని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ నియోజకవర్గ రూపురేఖలు స్వరాష్ట్రంలో పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడం.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కృషితో సెగ్మెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఐదేండ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గాభివృద్ధికోసం అక్షరాలా రూ.2,931కోట్లను ఖర్చుచేసింది. ఇబ్రహీంపట్నం దవాఖానను 30 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేయడంతోపాటు డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చి ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నది.
అదేవిధంగా యాచారం దవాఖానను 50 పడకలకు అప్గ్రేడ్ చేయడంతో కొత్తగా 12 బస్తీ దవాఖానలు, 6 పల్లె దవాఖానలను ఏర్పాటుచేసి అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేసింది. మిషన్ కాకతీయలో 126 చెరువులను రూ.86.81కోట్లతో అభివృద్ధి చేసింది. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్చెరువును రూ.2.5కోట్ల హెచ్ఎండీఏ నిధులతో ఆధునీకరించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును సైతం రూ.18.64 కోట్లతో నవీ కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ పార్కులు, రెస్టారెంట్లు, బోటింగ్, వాకింగ్ ట్రాక్లను అందుబాటులోకి తెచ్చి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రూ.533కోట్లను వెచ్చించి మిషన్ భగీరథ పథకం ద్వారా గడపగడపకూ తాగునీటిని అందిస్తున్నది.
హస్తినాపురంలో ఉన్న ఆర్టీఏ కార్యాలయాన్ని మన్నెగూడకు తీసుకురావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడిం ది. అదేవిధంగా రూ.10కోట్లతో సాగర్ హైవేపు బొంగుళూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు, యాచారం, మంచాల, మాల్లలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసింది. రూ.914కోట్లతో డబుల్, నాలుగు లేన్ల రహదారులను ఏర్పాటు చేయడంతోపాటు అనేక ప్రాంతాలకు కొత్త రోడ్లను వేయడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. కొత్తపేటలో ఉన్న గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను అబ్దుల్లాపూర్ మెట్కు తరలించగా విజయవంతంగా కొనసాగుతున్నది. కొహెడలో 178 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఏర్పాటుకు కార్యాచరణ సైతం మొదలైంది. రూ.6.90 కోట్లను వెచ్చించి 23 రైతు వేదికలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో వృద్ధులు 12,024 మందికి, వితంతువులు 11,886 మందికి, దివ్యాంగులు 5,693 మందికి, చేనేత కార్మికులు 94 మందికి, గీత కార్మికులు 1,030 మందికి, ఒంటరి మహిళలు 554 మందికి పింఛన్లను ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేస్తున్నది. 9,011 మందికి రూ.11.39 కోట్లను వెచ్చించి కేసీఆర్ కిట్లను అందించింది.
రైతుబంధు సాయంగా 58,980 మంది రైతులకు 2018 నుంచి రూ.890 కోట్లను ఇవ్వడం జరిగింది. 702 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా కింద రూ.5 లక్షల చొప్పున రూ.35.10 కోట్ల సాయాన్ని అందింది. లక్ష లోపు రుణాలను 20,488 మంది రైతులకు రూ.105.75 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. స్వయం సహాయక మహిళా గ్రూపుల్లోని 66,693 మంది మహిళా సభ్యులకు రూ.1,039 కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా అందించడం జరిగింది. రూ.36.29 కోట్ల మేర వడ్డీలేని రుణాలను అందించగా..స్త్రీ నిధి కింద రూ.218.67 కోట్లను అందించి స్వయం ఉపాధికి తోడ్పాటునందించారు. గడపగడపకూ అందిన సంక్షేమ పథకాలతో నియోజకవర్గ ప్రజానీకం మంచిరెడ్డి అభ్యర్థిత్వానికి జై కొడుతున్నది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం 1952లో ఏర్పాటుకాగా..ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1972 వరకు జనరల్గాను 1978 నుంచి 2004 వరకు రిజర్వుడుగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో తిరిగి జనరల్గా మారింది. కాంగ్రెస్ పార్టీ చివరగా 1983లో గెలవగా ఆ తర్వాత నుంచి ఈ పార్టీకి గెలుపు అనేది అందని ద్రాక్షగా మారింది. టీడీపీ నుంచి మంచిరెడ్డి కిషన్రెడ్డి రెండుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. నాలుగోసారి కూడా ఈ నియోజకవర్గ ప్రజలు తనకే పట్టం కడతారని ఆయన ధీమావ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గ వేదికగా ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాల్లో పరిశ్రమల ప్రభ వెల్లివిరుస్తున్నది. 2014 నుంచి టీఎస్-ఐపాస్ అనుమతులతో 173 పరిశ్రమలు రూ.6,982.85 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై 8,274 మందికి ఉపాధి కల్పించాయి. టాటా బోయింగ్, టాటా సికోర్స్కి, టాటా లాక్హీడ్ మార్టిన్ కంపెనీలకు చెందిన ఏరోస్పేస్ వస్తువుల ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటై ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎలిమినేడులో ఏరోస్పేస్ విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుండగా.. కొంగరకలాన్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధ్దిగాంచిన ఫాక్స్కాన్ సంస్థ భారీ పెట్టుబడితో ప్లాంట్ను నెలకొల్పుతున్నది.
ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా..ఈ కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నా యి. బొంగుళూరు, బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్కులు ఏర్పాటయ్యాయి. యాచారం, కందుకూరు మండలాల పరిధి లో 19,333 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ తో 5 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఖాల్సా గ్రామంలో 123 ఎకరాల్లో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 43 కంపెనీలకు భూమిని కేటాయించింది. రూ.55.67 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసే ఈ కం పెనీలతో 30వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు ఈ ప్రాంతం దగ్గరగా ఉండడం వంటి అనుకూలతల కారణంగా పారిశ్రామిక వేత్తలు ఇబ్రహీంపట్నం వైపుగా పరిశ్రమలను ఏర్పాటు కు ఆసక్తి చూపుతున్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి వివిధ సంఘాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తున్నది. నియోజకవర్గ అభివృద్ధి మంచిరెడ్డితోనే సాధ్యమని భావించిన అనేక సంఘాల సభ్యులు సంపూర్ణ మద్దతును అందిస్తున్నారు. సోమవారం మంచిరెడ్డి కిషన్రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి విస్తృతంగా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని ఆర్ఎంపీ వైద్యులు సోమవారం శేరిగూడలో సమావేశమై తమ పూర్తి మద్దతు మంచిరెడ్డికే ఇస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు ఉక్కుల అశోక్ మాట్లాడుతూ ఆర్ఎంపీ వైద్యుల సమస్యలపై మంచిరెడ్డి తక్షణమే స్పందించారని ఆయన గెలుపుకోసం తామంతా కృషిచేస్తామన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన అనేకమంది ఆర్యవైశ్యులు కూడా తుర్కయాంజాల్లో సమావేశమై ఈ సందర్భంగా మంచిరెడ్డికే మద్దతు ప్రకటిస్తామంటూ తీర్మానం చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వారి సమావేశానికి హాజరై ఆర్యవైశ్యులకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీఇచ్చారు. అలాగే, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని దాదాపుగా పది కాలనీల అసోసియేషన్ల ఆధ్వర్యంలో సిరిటౌన్షిప్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మంచిరెడ్డికే మద్దతు అని ప్రకటించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రమణారెడ్డి, డీసీసీబీ వైస్చైర్మన్ సత్తయ్య, నాయకులు పాల్గొన్నారు.
ఓటింగ్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సంచార రథాలను సోమవారం జిల్లా కలెక్టర్ హోలీకేరీ కలెక్టరేట్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కుపై చైత న్యం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే సంచార రథాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్ర తిమాసింగ్, జడ్పీ సీఈవో దిలీప్ కుమార్, డీఆర్డీవో పీడీ, స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్, ఆర్డీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.