స్వయం సహాయక సంఘాల సభ్యుల అభ్యున్నతికి కృషిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీవోఏ) వేతనాల పెంపుపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. రాఖీ పండుగ కానుకగా వారి వేతనాలను 8వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సంఘాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేసినందుకు ఆయా మహిళా సంఘాల నుంచి గౌరవ వేతనంగా రూ.3వేలు అందేది. ప్రత్యేకించి ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా అందేదికాదు. అలాంటిది స్వరాష్ట్రంలో వీవోఏ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016 నుంచి నెలకు రూ.3వేల వేతనాన్ని అందజేస్తూ వస్తున్నారు. దీంతో అన్నీ కలిపి ప్రతి నెలా రూ.6వేల వేతనం అందేది. 2021లో గౌరవ భృతిని 30శాతం పెంచడంతో వీవోఏల వేతనం ప్రస్తుతం రూ.6,900లకు అందుతున్నది. తాజాగా రాఖీ పండుగ కానుకగా రూ.1100 వేతనాన్ని పెంచగా.. రూ.8వేలకు చేరింది. రంగారెడ్డి జిల్లాలో 753 మందికి, వికారాబాద్ జిల్లాలో 657 మంది వీవోఏలకు ప్రయోజనం చేకూరనున్నది. అంతేకాకుండా యూనిఫాం కోసం ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను కేటాయించడంతోపాటు, ప్రతి మూడు నెలలకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని ఏడాదికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంపై స్వయం సహాయక సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. శుక్రవారం పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చేసిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం కార్యరూపంలోకి తెచ్చింది. రాఖీ పండుగ కానుగగా వేతనాలను పెంచి వీవోఏలకు తీపి కబురును అందించింది. గత ఆగస్టు 17న ఇబ్రహీంపట్నంలో చేపట్టిన వివిధ అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా మంత్రి వేతనాలు లేక వీవోఏలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటించిన కొద్ది రోజులకే ప్రభుత్వం వీవోఏల వేతనాలను పెంచడంతోపాటు ఇతర విజ్ఞప్తులనూ అంగీకరించింది.’
ఉమ్మడి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సహాయకులుగా పనిచేసిన వీవోఏ(విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు)ల వేతనాలు అరకొరగానే ఉండేవి. సంఘాలకు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఇతర సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేసినందుకు ఆయా మహిళా సంఘాల నుంచి గౌరవ వేతనంగా రూ.3వేల గౌరవ వేతనం మాత్రమే అందేది. ప్రత్యేకించి ప్రభుత్వ ఖజానా నుంచి నయా ఏనాడూ ఇవ్వలేదు. స్వరాష్ట్రంలో వీవోఏ సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016 నుంచి నెలకు రూ.3వేల వేతనాన్ని అందజేస్తూ వచ్చారు. దీంతో అన్నీ కలిపి రూ.6వేల వేతనం వచ్చేది. 2021లో గౌరవ భృతిని ప్రభుత్వం 30శాతం పెంచడంతో వీవోఏల వేతనం రూ.6,900 అయ్యింది. వేతనం పెంపుపై వీవోఏల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి వేతనాన్ని పెంచి ఆదుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు రాఖీ పండుగ కానుకగా రూ.1,100 వేతనాన్ని పెంచారు. రెండేళ్ల వ్యవధిలోనే ప్రభుత్వం వీవోఏల వేతనాన్ని రూ.2వేలు పెంచగా..ప్రస్తుతం వీవోఏల మొత్తం వేతనం రూ.8వేలకు చేరింది.
రంగారెడ్డి జిల్లాలో ఒక జిల్లా సమాఖ్య ఉండగా..మండల సమాఖ్యలు 21 ఉన్నాయి. గ్రామ సమాఖ్యలు 788 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 19,192 స్వయం సహాయక సంఘాలు ఉండగా..వీటిలో 2,06,691 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. సంఘాల లావాదేవీలను చూసేందుకు జిల్లాలో 753 మంది వీవోఏలుగా పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న రూ.8వేల వేతనం అందనుంది. ప్రభుత్వం వేతనం పెంచడం పట్ల రంగారెడ్డి జిల్లాలోని వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు వేతనాన్ని పెంచి తమ కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
యూనిఫాం కోసం నిధులను కేటాయించాలని, ప్రతి మూడు నెలలకోసారి అమలవుతున్న రెన్యువల్ విధానాన్ని సవరించాలన్న వీవోఏల విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకరించింది. రెన్యువల్ విధానాన్ని ఏడాదికి పెంచడంతోపాటు, యూనిఫాం డ్రెస్ కోడ్ అమలుకోసం ఏడాదికి రూ.2కోట్లు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జీవిత బీమాకు సంబంధించిన విధి విధానాలపై అధ్యయనం చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో తమను ఏ ప్రభుత్వాలు ఈ రీతిగా పట్టించుకోలేదని వీవోఏలు పేర్కొంటున్నారు. మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకుని తమ కుటుంబాలకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీవోఏ)లకు వేతనాలను పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయానికి శుక్రవారం మంచాల మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయ ఆవరణలో మండల వీవోఏల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల వీవోఏల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతి మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో వేతనాలు పెంచడం సంతోషదగ్గ విషయమన్నారు. నెలకు వీవోఏలకు రూ. 8వేలకు పెంచి కుటుంబాలకు పెద్దదిక్కుగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు సువర్ణ, ప్రమీల, సుజాత, కౌసల్య, స్వాతి, గీత, యశోద, మంజుల, హేమలత, సరోజ, అండాళు, పద్మ, వరలక్ష్మి, చంద్రకళ, మాదవి, కళావతి, చామంతి, స్వప్న, శివరాణి, స్వరూప, లత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వీవోఏలుగా పని చేస్తున్న 17,608 మందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నందిగామ మండల కేంద్రంలో వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నో ఏండుగా అతితక్కువ వేతనంతో పని చేస్తున్న వీవోఏలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిందని సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, సీసీ అరుణ, వీవోఏలు పాల్గొన్నారు.
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వీవోఏలుగా పనిచేస్తున్న మాకు వేతనాలు పెంచడం ఎంతో సంతోషంగా ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వాలూ మమ్ముల్ని పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ వచ్చినంక అడగకముందే గౌరవ భృతిని అందిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వేతనాల పెంపుతో మా బాధ్యత మరింత పెరిగింది. పనిపై మరింత దృష్టి సారించి స్వయం సహాయక సంఘాల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తాం.
-రమాదేవి, వీవోఏల సంఘం అధ్యక్షురాలు, ఇబ్రహీంపట్నం
వీవోఏల వేతనాలు పెంచడం సంతోషకరం. అరకొర వేతనాలతో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ దయవల్ల కొంత మేరకు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం. వీవోఏల కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే ఈసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా.
– భాగ్య, వీవోఏ (దోమ)
గతంలో గ్రామాల్లో చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ చల్లని దీవెనతో మాకు రెండుసార్లు వేతనాలు పెరిగాయి. పెరిగిన వేతనాలతో రూ. 8వేలకు చేరడం సంతోషకరం. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
– బాలమణి, వీవోఏ ఇబ్రహీంపట్నంరూరల్
మా ఇబ్బందులను గుర్తించి వేతనాలను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షణీయం. అన్ని వర్గాలను ఆదుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తున్న మాకు కూడా వేతనాలను పెంచడం హర్ణణీయం.
– లత, వీవోఏ, ఇబ్రహీంపట్నం
వీవోఏల వేతనాలను రూ. 8 వేలకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. వేతనాలను పెంచి ప్రభుత్వం మాకు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
– అమరజ్యోతి, వీవోఏ, అంతారం గ్రామం (చేవెళ్ల)
గతంలోని ప్రభుత్వాలు వీవోఏలను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మా సమస్యలను గుర్తించి దశలవారీగా మా వేతనాలను పెంచుతూ మాకు సముచిత గౌరవాన్ని కల్పిస్తున్నారు. వేతనాలు రూ.8 వేలకు చేరనుండటం చాలా సంతోషకరం
– గడ్డమీది శ్రీనివాస్, వీవోఏ, దేవునిఎర్రవల్లి, (చేవెళ్ల)
మా వేతనాలను రూ. ఎనిమిది వేలను పెంచిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. పెరిగిన వేతనాలతో మేము మరింత ఉత్సాహంగా మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేస్తాం. ముఖ్యమంత్రి అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
– శివనీల, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మాడ్గుల
తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే వీవోఏల వేతనాలు రెండుసార్లు పెరిగాయి. గతంలో రూ.2000 మాత్రమే వస్తుండేవి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మా వేతనాలు పెరుగుతున్నాయి. ఇంత మంచి నాయకుడికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– వెంకటయ్య, మండల సంఘం ఉపాధ్యక్షుడు, యాలాల
రాఖీ పండుగ కానుకగా సీఎం కేసీఆర్ మాకు తీపి కబురు అందించారు. గతంలోని ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలోనే మాకు న్యాయం జరుగుతున్నది.
– శాకప్ప, మండల వీవోఏల సంఘంఅధ్యక్షుడు, యాలాల
సీఎం కేసీఆర్ రాఖీ పండుగ కానుకగా వేతనాలను పెంచారు. మాకు భరోసా కల్పించిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– భీమమ్మ, మండల వీవోఏల సంఘంసెక్రటరీ, యాలాల