సైదాబాద్/మాదన్నపేట,మే 11: దేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో 64శాతం రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సైదాబాద్, సంతోష్నగర్లలో నూతనంగా నిర్మించిన సైదాబాద్, ఐఎస్ సదన్ పోలీస్స్టేషన్ల నూతన భవనాలను ఆయన ఎమ్మెల్యేలు అహ్మద్ బలాల, పాషాఖాద్రీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, డీజీపీ అంజనీ కుమార్, నగర కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి ప్రారంచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ సేవలను అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణే అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలతో ప్రజలందరి సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు ఎంతోగాను కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో నగరంలో మతకలహాలు, కర్ఫ్యూ వంటి ఘర్షణలు జరిగేవని, సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. మహిళల రక్షణకు షీటీమ్, మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా, దేశంలో ఎక్కడాలేని విధంగా పోలీసు వ్యవస్థలో 33శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్నామన్నారు. ఉగ్రవాద కదలికలపై దర్యాప్తు చేస్తున్నామని, ఏటీఎస్ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారని, విచారణ జరుపుతున్నారని తెలిపారు.
మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల మాట్లాడుతూ సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 50 లక్షలను కేటాయించటానికి సిద్ధమేనని, అయితే ఇప్పటికే బ్యాంక్ కాలనీలో ఉన్న పోలీస్స్టేషన్ను వెంటనే ఖాళీ చేసి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు అందించాలని అన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని తాను మంజూరు చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్ధ మూలంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందని అన్నారు. డీజీపీ అంజనీకుమార్, నగర కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ రెండు పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పోలీస్స్టేషన్ నిర్మాణానికి సహకరించిన ఆవుల రవికుమార్, మేఘమాల మురళీధర్తో పాటు దాతలకు మెమోంటోలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్, ఐఎస్ సదన్ డివిజన్ల కార్పొరేటర్లు కొత్తకాపు అరుణ, జంగం శ్వేత, టీఎస్పీహెచ్సీఎల్ ఎండీ రాజీవ్ రతన్, రమేశ్ రెడ్డి, సౌత్-ఈస్ట్ జోన్ డీసీపీ రూపేశ్, మలక్పేట ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె. సుబ్బరామి రెడ్డి, డీఐ చంద్రమోహన్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ అనితానాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, అజం అలీ, సామ సుందర్ రెడ్డి, ఫైబర్టెల్ రాజు, సుమంత్, పీస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.