సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గుండె పోటు వచ్చిన బాధితులకు కార్డియాక్ రిహాబ్ చికిత్సతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని అందించవచ్చని ఈఎస్ఐ మాజీ వైద్యాధికారి, కార్డియో రిహాబ్ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీధర్ బాబి తెలిపారు. కార్డియో రిహాబ్ ద్వారా గుండెలోని కండరాలు బలపడి, గుండె పోటు వచ్చే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయని వివరించారు. ఈ క్రమంలోనే నేవీలో విధులు నిర్వర్తిస్తున్న రామారావు(50) సెప్టెంబర్ 27, 2022న గుండెపోటుకు గురై, స్టంట్ వేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
రామారావు తిరిగి ఉద్యోగంలో చేరే ముందు వైద్యపరక్షలు జరిపిన నేవీ మెడికల్ బోర్డు అతను విధులు నిర్వర్తించేందుకు అర్హుడు కాదని తేల్చి చెప్పడంతో రామారావును విధుల్లో కొనసాగేందుకు ఉన్నతాధికారులు నిరాకరించినట్లు డా.మురళీధర్ వివరించారు. తీవ్ర మనోవేదనకు గురైన రామారావు గూగుల్ ద్వారా కార్డియో రిహాబ్ గురించి తెలుసుకుని తమను ఆశ్రయించారని, ఈ క్రమంలో రోగికి మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలైన ట్రెడ్మిల్ జాగింగ్, స్టెప్ ఎరోబిక్స్, 5కె, 10కె రన్ తదితర వ్యాయామాలు చేయించినట్లు వివరించారు.
మూడు నెలల తరువాత రామారావు తిరిగి నేవీ మెడికల్ బోర్డు నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో సఫలీకృతుడయ్యాడని, దీంతో అన్ఫిట్ అని చెప్పిన అధికారులు అతడిని విధుల్లోకి తీసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు రోగులు సైతం హార్ట్ఎటాక్కు గురై, కార్డియో రిహాబ్ చికిత్స పొందితన తరువాత తిరిగి వారి వారి విధుల్లో చేరినట్లు తెలిపారు.