కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు
మనోధైర్యమే అసలైన మందు
ప్రైవేటు వైద్యంపై పటిష్ట నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు..
‘నమస్తే’తో ఖమ్మం డీఎంహెచ్వో మాలతి
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 28:మహమ్మారిపై వైద్యారోగ్యశాఖ యుద్ధం చేస్తున్నది. కొవిడ్ బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఆక్సిజన్, బెడ్స్, మెడిసిన్ కొరత లేదు. బాధితులు ఏ సమయంలో వచ్చినా వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అని డీఎంహెచ్వో మాలతి పేర్కొన్నారు. బుధవారం ఆమెను ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ చేసింది. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్, బెడ్స్ అందుబాటులో ఉన్నాయా? ఆక్సిజన్ నిల్వల పరిస్థితి? ఇప్పటి వరకు ఎంత మందికి పరీక్షలు వేశారు.? ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తదితర అంశాలను ఆమె వివరించారు.
కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత ఎలా ఉంది..?
జిల్లాలో సెకెండ్ వేవ్ కొంత ఉధృతంగానే ఉన్నది. రోజుకు 500 నుంచి 1000 లోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ బాధితుల్లో చిన్నారులతో పాటు 25 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా ఉంటున్నారు.
కరోనా టెస్ట్లు, పాజిటివ్ కేసుల సంఖ్య ఎలా ఉన్నది..?
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 34 ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్ట్లు నిర్వహిస్తున్నాం. మంగళవారం వరకు అందిన సమాచారం మేరకు 3,55,589 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 37,575 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మిగిలిన 3,18,014 మందికి నెగెటివ్ వచ్చిది. పాజిటివ్గా వచ్చిన వారిలో సాధారణ లక్షణాలు కలిగిన వారు హోం ఐసొలేషన్లోనే ఉంటున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని బాధితుల ఇష్టానుసారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్కు సిఫార్సు చేస్తున్నాం.
బాధితులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు..?
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కొవిడ్ బాధితులకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తున్నాం. ఐసీయూ, ఐసొలేషన్ కలిపి ప్రస్తుతం 240 బెడ్లను సిద్ధంగా ఉంచాం. ఇప్పుడు ఆస్పత్రిలో 200 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారందరికీ సకాలంలో మందులు, పోషకాహారం ఇస్తున్నాం. రాత్రి రెండు పూటలా కోడి గుడ్డుతో భోజనం పెడుతున్నాం.
హోం ఐసొలేషన్లో ఎంత మంది ఉన్నారు.?
జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది కొవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ఉన్నారు. పాజిటివ్గా వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇంటి వద్దే ఉండి వైద్యం పొందుతున్నారు. వారందరికీ వారానికి సరిపడా మందుల కిట్ ఇస్తున్నాం. ప్రతిరోజూ ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారిలో నూటికి 80 మంది హోం ఐసొలేషన్లో ఉన్నవారే. మనో నిబ్బరంగా ఉంటే ఎంతటి ప్రాణాంతకమైన జబ్బునైనా జయించవచ్చు.
ప్రైవేటు హాస్పిటళ్లలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నిఘా పెట్టారు..?
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో ఉన్నది. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది. ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు, యాజమానులు సానుకూలంగా ఉండాలి. ప్రాణ భయంతో కాపాడాలని వస్తున్న వారిని పీల్చిపిప్పి చేయడం తగదు. బహిరంగ మార్కెట్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ లేవని, ఆక్సిజన్ లేదని కృత్రిమ కొరత సృష్టించే వారిపై పటిష్ట నిఘా పెట్టాం. జాయింట్ కలెక్టర్ మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. కొవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాటి లైసెన్స్లు రద్దు చేస్తాం. అవసరమైతే చట్టపరంగా కేసులూ పెడతాం.
వైరస్ మన శరీరంలో ఎన్నిరోజులు ఉంటుంది..?
వాస్తవానికి వైరస్ జీవితకాలం 24 గంటలు. కానీ అది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్ల సంఖ్య పెంచుకుంటుంది. 15 రోజుల్లోపు కరోనా పూర్తిగా అంతం అవుతుంది. ఈ సమయంలో బాధితులు ఎలాంటి ఆందోళనకు గురవకుండా, వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకుంటూ, పౌష్టికాహారం తీసుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే తొందరగా కోలుకుంటారు.