వికారాబాద్, మార్చి 3 : పల్లె ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఆయుష్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సరైన వైద్య పరీక్షలు చేసేలా ఆయుష్ గ్రామ్ కార్యక్రమం రాష్ట్రంలోని 10 గ్రామాల్లో నిర్వహించారు. జిల్లాలోని వికారాబాద్ మండల పరిధిలోని సిద్దులూరు, పూడూరు మండలంలోని సోమన్గుర్తి గ్రామాల్లో గురువారం ప్రత్యేక క్యాంపులు చేపట్టారు. హైదరాబాద్లోని వైద్యులు బూర్గుల రామకృష్ణారావు(డా.బీఆర్కేఆర్) ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ద్వారా 50 మందితో కూడిన ఒక్కో ఆయుష్ వైద్య బృందం గ్రామాల్లోని ప్రతి ఇంటినీ సందర్శిస్తున్నది. గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. తొలి విడుతగా ప్రభుత్వం 10 గ్రామాలను ఎంపిక చేసింది.
వికారాబాద్ మండలంలోని సిద్ధులూర్ గ్రామంలో నిర్వహించిన ఆయుర్వేద క్యాంపును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి తుకారం, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు సందర్శించారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించారు.
గ్రామంలోని ఇంటింటి సర్వే, వైద్య శిబిరం ముగిసిన అనంతరం సాయంత్రం ప్రజలకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పిస్తారు. సహజంగా దొరికే మొక్కలతో తయారు చేసుకొని ఏ రోగానికి ఎలాంటి మందులు వాడాలో వైద్యులు వివరిస్తారు. ఔషధ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఏ రోగాలకు ఎలాంటి మందులు వాడాలో బోర్డులపై రాసి, వీటిని గ్రామ పంచాయతీ ఆవరణ, పాఠశాల, దవాఖానల వద్ద ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కోసం ఏర్పాటు చేయనున్నారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు హాజరైన ప్రజలకు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు యోగా వైద్యులు ఇద్దరు గ్రామ ప్రజలకు యోగాను నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తారు. ఇందులో కొంత మంది ఇంటింటికీ తిరిగి సర్వే చేయడం, క్యాంపునకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద వైద్యులతో సలహాలు, సూచనలు అందిస్తారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు వారం, 10 రోజులకు సరిపడేలా ఇస్తారు.