సంపూర్ణ ఆరోగ్యానికి నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటీస్ వరకు.. రక్తపోటు నుంచి గుండెపోటు వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. నేటి పోటీ ప్రపంచంలో క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల్లో తలమునకలయ్యే పట్టణవాసులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు వ్యాయామాన్ని తమ జీవన విధానంలో భాగంగా చేసుకున్నారు. క్రమం తప్పకుండా ఉదయాన్నే గ్రౌండ్కు వెళ్లి వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రజల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. తెల్లవారుజామునే లేచి యువకులు రోడ్ల వెంట పరుగులు పెడుతుండగా, పెద్దవారు నడక కొనసాగిస్తున్నారు. అనంతరం మైదానాలకు వెళ్లి కాసేపు సేద తీరి వ్యాయామం, యోగాసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజురోజుకూ గ్రామాల్లో వాకర్స్ సంఖ్య పెరుగుతుండడంతో రోడ్లు, మైదానాలు ఉదయం పూట సందడిగా దర్శనమిస్తున్నాయి.
మొయినాబాద్, ఆగస్టు 27 : అజీర్ణం నుంచి అర్థరైటీటస్ వరకు.. గుండెపోటు నుంచి రక్తపోటు వరకు.. మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు.. ఏ సమస్య నివారణకైనా వ్యాయామమే మందు. వ్యాయామంతో ఆరోగ్యం పదిలమని చెప్పవచ్చు. ప్రస్తుతం కాలంలో యోగా, నడక, వ్యాయామానికి ఆదరణ పెరుగుతున్నది. వాకింగ్తో బద్ధకం వదిలిపోవడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం నడక వల్ల డీ విటమిన్ లభ్యంతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. కొవ్వు కరిగి గుండె పని తీరు మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
నడక నాలుగు రకాలుగా నయం అంటారు.. ఆధునిక యుగంలో శారీరక శ్రమ లేక రోగాల బారినపడుతున్నారు. నిత్యం వాకింగ్ చేయడం వల్ల చిన్నారుల నుంచి యువకులు, పెద్దలకు వ్యాయామమే ఆధునిక సంజీవనిగా మారిందని చెప్పవచ్చు. చలికాలం వచ్చిందంటే పల్లె, పట్టణమన్న తేడా లేకుండా మైదానాలు, రహదారులు నడక సాగించే వారితో సందడిగా కనిపిస్తుంటాయి. అరగంట నుంచి గంటపాటు వ్యాయామం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల ఏ దవాఖాన చూసినా రోగులతో కిక్కిరిసి పోతున్నది. పోలీస్, ఎక్సైజ్, రక్షణ శాఖలో ఉద్యోగం పొందాలంటే శారీరక దృఢత్వం తప్పని సరి. ఇందుకు పరుగు పందెం, షాట్పుట్, లాంగ్జంప్, హైజంప్ వంటి పోటీల్లో నెగ్గాల్సి ఉంటుంది. వ్యాయామంతో మనస్సు తేలికగా ఉండి, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
సర్వ రోగాలకు దివ్య ఔషధం..
మనిషి జీవన విధానం పూర్తిగా మారింది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. శారీరక, మానసిక రోగాలకు మార్నింగ్ వాక్ దివ్య ఔషధం. నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని కొన్ని నీళ్లు తాగాలి. అనంతరం విశాల మైదానాల్లో నడక సాగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం బాగుంది..
రెండు ఏండ్ల నుంచి నడుస్తున్నా. గతంలో పక్షవాతం వచ్చి రూ.లక్ష వరకు ఖర్చు పెట్టా. డాక్టర్లు వాకింగ్ చేయమన్నారు. వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంది. యోగాతోనూ మేలు చేకూరుతున్నది.
– ఎండీ జబ్బార్, సురంగల్
రోజంతా చురుకుగా ఉంటుంది..
వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. రోజు 4 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నా. తోటి స్నేహితులతో వ్యాయామం, యోగా చేస్తున్నా. శరీర అవయవాలు గట్టిపడుతున్నాయి.
– వంశరాజుల రవికుమార్, సురంగల్
ప్రశాంతంగా ఉంటుంది..
వాకింగ్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. నిత్యం 7 కిలో మీటర్లు వాకింగ్ చేస్తున్నా. రోగనిరోధక శక్తి పెరుగుతుందని యోగా శిక్షకులు, వైద్యులు సలహాలు ఇస్తున్నారు. వాకింగ్ చేయని రోజు బద్ధకంగా ఉంటుంది.
– యలాల లక్ష్మారెడ్డి , శ్రీరాంనగర్
ఎలాంటి రుగ్మతలు లేవు..
నా వయస్సు 70 ఏండ్లు. నిత్యం యోగా వేస్తా. నాకు ఎలాంటి రుగ్మతలు లేవు. పరిగడుపున గోరువెచ్చని నీళ్లు తాగుతా. ఇవ్వే నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. సురంగల్, శ్రీరాంనగర్ గ్రామాల యువకులకు యోగా నేర్పిస్తున్నా.
– గుమ్మళ్ల నర్సింహారెడ్డి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి, సురంగల్