వికారాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం ప్రైవేట్ మార్కెట్కు తరలుతున్నది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసినా..అక్కడ పెడుతున్న కొర్రీలు..జరుగుతున్న నష్టంతో అన్నదాతలు దళారులు, వ్యాపారుల వైపు చూస్తున్నారు. తరుగు పేరిట కిలోల కొద్దీ ధాన్యాన్ని తీయడం.. తేమ శాతం అధికంగా ఉందంటూ తక్కువ ధరకు కొంటుండ డం.. ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు కేంద్రాల్లో ఇస్తున్న మద్దతు ధర కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుండడంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలోని మెజార్టీ రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా ప్రైవేట్ మార్కెట్లోనే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
అదేవిధంగా వ్యాపారులు, దళారులు మద్దతు ధర కం టే రూ.100-200 అధికంగా ఇచ్చి ధాన్యాన్ని కొంటుండడంతో రైతులంతా ప్రైవేట్ మార్కెట్వైపు వెళ్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో జిల్లాలోని కొనుగోలు కేంద్రాలు మూతపడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 129 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 30 మూతపడగా.. మరో వారం, పది రోజుల్లో మిగతా కొనుగోలు కేంద్రాలను కూడా మూసేసే ఆలోచనలో సంబంధిత శాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం.
కేవలం 34 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
జిల్లాలో ధాన్యం పండించిన రైతులంతా దళారులు, వ్యాపారులకు విక్రయిస్తుండడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అంతంత మాత్రంగానే వస్తున్నది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు రాగా.. ఇప్పటివరకు కేవలం 34,876 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అయితే జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 1.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేయగా, కొనుగోలు కేంద్రాల్లో చేస్తున్న మోసాలతో నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా రాకపోవడం గమనార్హం. మరోవైపు ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామం టూ ప్రభుత్వం ప్రకటించినా పది, పదిహేను రోజులు దాటినా సంబంధిత డబ్బులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడు తున్నారు.
ధాన్యాన్ని సేకరించిన అనంతరం వెంటనే బిల్లులు చేయాల్సిన కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.76.83 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన జిల్లా పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు కేవలం రూ. 22. 36 కోట్ల చెల్లింపులు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగతా సుమారు రూ.38కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉండడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతూ.. కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. డబ్బులు ఎప్పుడు వస్తాయని అక్కడి సిబ్బందిని అడుగుతున్నారు. కాగా యాసంగి సీజన్లో క్వింటా వరి ధా న్యం ఏ గ్రేడ్ రకానికి రూ.2203, సాధారణ రకానికి రూ.2183 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నది.