Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్ (Sentiment) కు ఊతమిచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు పైకి ఎగిశాయి. సెన్సెక్స్ (Sensex) 374 పాయింట్లు లాభపడి 78,954.76 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty) 11.35 పాయింట్లు పెరిగి 24,636 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధిక లాభాలు నమోదు చేశాయి. మరోవైపు రియల్టీ, మీడియా, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మిడ్క్యాప్ సూచీ 0.44 శాతం తగ్గగా, స్మాల్క్యాప్ సూచీ 0.48 శాతం లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లు మాత్రం మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి.
ముడి చమురు ధరలు తగ్గడం భారత్కు అనుకూల పరిణామమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దిగుమతి వ్యయం తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్కు ఇది మద్దతుగా నిలిచిందని విశ్లేషిస్తున్నారు.