UPI charges : యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007, సవరణ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఛార్జీలు విధించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దీని ద్వారా ఇప్పటివరకు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రద్దవుతుంది. ఇంతకుముందు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపైనే ఛార్జీలు ఉండేవి.
యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ, ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్స్పై కూడా ఛార్జీలు విధిస్తారు. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్మెంట్) బిల్, 2026 పేరిట రూపొందిన ఈ బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కోసం పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 బిల్లు, ద ఇన్కం ట్యాక్స్ యాక్ట్ 2025 బిల్లు, ద ఫైనాన్స్ యాక్ట్, 2026 బిల్లులకు సవరణలు చేశారు. దీని ద్వారా భవిష్యత్లో ఎలక్ట్రానిక్ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారు. ఏ తరహా పేమెంట్పై ఎంత ఛార్జీ అనేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కు, పేమెంట్స్ విధానాన్ని నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం అందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే వ్యాపార సంస్థలు పరిమిత ఫీజు చెల్లిస్తున్నాయి. యూపీఐ లావాదేవీలపై వ్యాపార సంస్థలు ఎలాంటి ఛార్జీలు లేవు.
కానీ, కొత్త చట్టం ద్వారా యూపీఐ లావాదేవీలపై కూడా వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం ఇప్పటికిప్పుడు అమలులోకి రాకపోవచ్చు. దీనికి సంబంధించిన నిబంధనలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ ఛార్జీలు వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారులే చెల్లించాలి. అది కూడా వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులు మాత్రమే స్వల్ప మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలి. తర్వాత రాష్ట్రపతి అంగీకారం తెలపాలి. ఆ తర్వాత ఈ బిల్లు చట్టంగా అమలులోకి వస్తుంది. దీనికి మరికొంత సమయం పడుతుంది.