మన ఊరు-మన బడి కార్యక్రమం కింద సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ విద్యా సంవత్సరం సమూల మార్పులను తీసుకొచ్చింది. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 11 పేపర్లు రాయాల్సి ఉండగా, ఆరు పేపర్లకు కుదించింది. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. వంద శాతం సిలబస్ను పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో 13,994 మంది, వికారాబాద్ జిల్లాలో 8,291 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే ప్రత్యేక తరగతుల సమయంలో స్నాక్స్ అందజేసేందుకు రంగారెడ్డి జిల్లాకు రూ.71.36 లక్షలు, వికారాబాద్ జిల్లాకు రూ.42.28 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. అంతేకాకుండా పరీక్షా విధానంపై ఉపాధ్యాయులు పలు సూచనలు, సలహాలను ఇస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
షాబాద్, ఫిబ్రవరి 12 : పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం సమూల మార్పులు తీసుకువచ్చింది. కొవిడ్ తర్వాత వందశాతం సిలబస్తో టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 11 పేపర్లు రాయాల్సి ఉండగా ప్రభుత్వం ఆరు పేపర్లకు కుదించింది. ఉన్నత పాఠశాలలో వచ్చే నెల చివరి వరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. రోజూ ఉదయం, సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు 49,754 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్కు దీటుగా వసతులు కల్పిస్తుండడం, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ స్కూళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
జిల్లాలో 49,754 మంది విద్యార్థులు
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఈ ఏడాది 49,754 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 227 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో 13,038 మంది విద్యార్థులు, 15 బీసీ గురుకులాల్లో 1,108., 17 కేజీబీవీల్లో 629., 660 ప్రైవేట్ పాఠశాలల్లో 31,024., 11 మోడల్ స్కూల్లో 1,679 మందితో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న 2,276 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతోపాటు 10జీపీఏ రావడానికి పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.
పరీక్ష విధానంలో సమూల మార్పులు
టెన్త్ పరీక్ష విధానంలో ఈ విద్యా సంవత్సరం నుంచి వందశాతం సిలబస్తో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు పేపర్లు ఉన్న వాటి స్థానంలో వందశాతం సిలబస్తో ఒకే పేపర్ను తీసుకొచ్చారు. 11 పేపర్లు రాయాల్సిన విద్యార్థులు ఏప్రిల్లో జరిగే వార్షిక పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే రాయనున్నారు. ఆరు పేపర్ల విధానంపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో ఈ నెల చివరి వరకు ప్రణాళికలు రూపొందించారు.
రోజూ ఉదయం, సాయంత్రం సమయంలో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారంలో రెండురోజుల పాటు పరీక్షలు పెడుతున్నారు. ఫిబ్రవరి, మార్చిలో ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. సామాన్య శాస్ర్తానికి సంబంధించి ఒకే రోజు రెండు భాగాలుగా పరీక్ష నిర్వహించనున్నారు. 11పేపర్లు ఉన్న సమయంలో ఒక పేపర్ సరిగ్గా రాయని విద్యార్థులు రెండో పేపర్లో బాగా చదివి రాసేవారు కానీ ఇప్పుడు వందశాతం చదివి ఒకే పేపర్లో మంచి మార్కులు సాధించేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలకు సిద్ధమవుతున్న 13,994 మంది విద్యార్థులకు రూ.71.36లక్షలు ఖర్చు చేసి 34రోజుల పాటు రోజూ సాయంత్రం ఒక్కో విద్యార్థికీ రూ.15 ఖర్చు చేసి ప్రభుత్వం స్నాక్స్ అందజేయనుంది.
ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్నాం
మా పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం, సాయం త్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు ద్వారా పరీక్షలపై పాఠాలు బోధించి మా ఉపాధ్యాయులు మాకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో రెండు రోజులు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం రోజుకు రూ.15 ఖర్చు చేసి స్నాక్స్ అందించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. వార్షిక పరీక్షలో 10జీపీఏ సాధించేలా కష్టపడి చదువుతున్నాను.
జిల్లాలో 49,754 మంది విద్యార్థులు : సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో జిల్లాలో ఈ ఏడాది వందశాతం సిలబస్తో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి మొత్తం ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు 49,754 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
– అఖిల, పోతుగల్ ఉన్నత పాఠశాల