వికారాబాద్, మే 27 : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధిరంగాన్ని ఎంచుకొని ఉపాధిపొందడంతో పాటు ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మర్పల్లి మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, ధారూరు మండల మాజీ అధ్యక్షుడు గోణుగోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకోవాలి
కాలనీల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు మధుకాలనీ, రాజీవ్నగర్ కాలనీల్లో మీతో నేను కార్యక్రమంలో పాల్గొని, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వార్డుల్లోని అండర్గ్రౌండ్ డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. లీకేజ్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లోని పాత స్తంభాలు తొలగించి, నూతన స్తంభాలను ఏర్పాటు చేసి, 33కేవీ విద్యుత్ లైన్కు అడ్డుగా ఉన్న చెట్ట కొమ్మలను తొలగించాలని సూచించారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకు గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని అందించాలని తెలిపారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ.. నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. 17వ వార్డులో ఇద్దరు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు అనంత్రెడ్డి, గోపాల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
వార్డుల్లో చెత్త చెదారం తొలగింపు
పట్టణంలో 7 రోజుల పాటు 34 వార్డుల్లో నిర్వహించిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ విజయవంతంగా ముగిసిందని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 1,2,15,19,33వ వార్డుల్లో చైర్పర్సన్ పర్యటించారు. ఆయా వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా క్లీన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వెంట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, కౌన్సిలర్లు రాములు, సుధాకర్రెడ్డి, వేణుగోపాల్, నాయకులు సుభాశ్, మల్లయ్య, పర్మయ్య, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోహినుద్దీన్, సూపర్వైజర్ శ్రీను, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు ఉన్నారు.