రంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకురాగా.. ఆ పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి.. భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. పేరు మారినా తీరు మారకపోవటంతో భూబాధితుల సంఖ్య పెరుగుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. ధరణిలో సమస్యలు పరిష్కారం కావటంలేదనే సాకుతో తెచ్చిన భూభారతి పోర్టల్ రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. ఈ పోర్టల్లో ఇప్పటివరకు సుమా రు 20 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేసేందుకు రెవెన్యూ అధికారులు లంచాలకు తెరలేపరన్నా ఆరోపణలున్నాయి. జిల్లాలో భూముల ధరలు పెరగడంతోపాటు భూసమస్యలూ పెరుగుతున్నాయి. వాటిని పరిష్కరించాలంటే కిందిస్థాయి రెవె న్యూ అధికారులు ఎకరానికి ఇంత ఇవ్వాలని ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ. మూడు నుంచి రూ. ఐదులక్షల చొప్పున పర్సంటేజీ తీసుకుని ఫైళ్లను అప్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
భూభారతి పోర్టల్లో సమస్యల పరిష్కారం కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే ముం దుగా కిందిస్థాయి లో ఆర్ఐ పరిశీలిస్తారు. అనంతరం తహసీల్దార్ .. తహసీల్దార్ నుం చి ఆర్డీవో, ఆర్డీవో నుంచి అదనపు కలెక్టర్ వరకు ఫైల్ వెళ్తుంది. ఆర్ఐ పరిశీలించి ఆ ఫైల్ ను పైస్థాయికి పంపించాలంటే ఆర్ఐ చేయి తడపాల్సిందేనని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కిందిస్థాయి అధికారులను తృప్తి పరచకపోవటంతోనే జిల్లాలో పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.
కాగా, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 14 మాడ్యుల్స్ను తీసుకొచ్చింది.
గతంలో ప్రతి చిన్న పనికీ కలెక్టర్ను ఆశ్రయించాల్సి వచ్చేది. చిన్న చిన్న సమస్యలను కిందిస్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశమున్నా..పోర్టల్లో ఆ చాన్స్ ఇవ్వలేదు. దీంతో సమస్యల పరిష్కారం లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సత్వర పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లకు లాగిన్లు ఇచ్చింది ప్రభుత్వం. అయినా వారు సమస్యలను పరిష్కరించటం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.