బొంరాస్పేట, మార్చి 20 : జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని డీఆర్డీఏ, ఇంజినీరింగ్ అధికారులు ఆదేశించడంతో గ్రామాల్లో పనులు జోరందుకున్నాయి.
సీసీ రోడ్లతో మారుతున్న గ్రామాల రూపు రేఖలు..
గ్రామాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఏసీడీఎఫ్), ఉపాధిహామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇవే కాకుండా మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ నిధులతో కూడా సీసీ రోడ్ల నిర్మాణం కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఇలా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండేవి. వర్షాకాలం వస్తే చాలు రోడ్లన్నీ బురదగా మారి ప్రజలు నడవడానికి నానా అవస్థలు పడేవారు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో తండాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.
మండలాల వారీగా మంజూరైన పనులు..
బషీరాబాద్ మండలానికి రూ.1.93 కోట్లు, బొంరాస్పేటకు రూ.3.29 కోట్లు, చౌడాపూర్కు 1.20 కోట్లు, దోమ మండలానికి రూ.3.70 కోట్లు, దౌల్తాబాద్కు 2.75 కోట్లు, కొడంగల్కు రూ.2.66 కోట్లు, కోట్పల్లికి రూ.50 లక్షలు, కులకచర్లకు రూ.3.35 కోట్లు, మోమిన్పేటకు రూ.40 లక్షలు, నవాబ్పేటకు రూ.90 లక్షలు, పరిగికి రూ.2.45 కోట్లు, పెద్దేముల్కు రూ.2.20 కోట్లు, పూడూరులో సీసీ రోడ్లకు రూ.3.25 కోట్లు, ఒక మెటల్ రోడ్డుకు రూ. 20 లక్షలు, తాండూరుకు రూ.2 కోట్లు, యాలాలకు రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయి. మంజూరైన పనుల్లో చాలా వాటిని ఇప్పటికే ప్రారంభించి పనులు చేపట్టగా మిగిలిన వాటిని కూడా ప్రారంభించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..
ఉపాధిహామీ పథకం ద్వారా బొంరాస్పేట మండలానికి రూ.3.29 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు ప్రారంభించాం. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కృషితో చాలా గ్రామాలు, తండాలకు ఎక్కువ నిధులు వచ్చాయి. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.
– సుదర్శన్రెడ్డి, వైస్ ఎంపీపీ బొంరాస్పేట
అంతర్గత రహదారులు బాగుపడుతున్నాయి..
గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించడం వల్ల అంతర్గత రహదారులు బాగుపడుతున్నాయి. ఒకప్పుడు వర్షం పడితే రోడ్లు బురదగా మారి నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ప్రతి ఏటా ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి.
– రాజేశ్వరి, రేగడిమైలారం సర్పంచ్