మర్పల్లి, నవంబర్ 11 : రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీప్రాంతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమంతో ప్రతియేటా ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మండలంలోని నర్సాపూర్ పెద్ద తండాపాఠశాల, పంచాయతీ కార్యాలయ ఆవరణలో వివిధ రకాల మొక్కలతో పచ్చదనం ఉట్టిపడుతున్నది.
హరితహారం కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తండావాసులు భాగస్వాములయ్యారు. పాఠశాల ఆవరణలో నల్లమట్టి, పశువుల ఎరువు చల్లి మొక్కలు నాటారు. మొక్కలకు రక్షణగా పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సంరక్షిస్తుండటంతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
ఆదర్శంగా మొక్కలు పెంపకం
కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైన నర్సపూర్ తండాను మొక్కల పెంపకంలో ఆదర్శంగా నిలిచేందుకు తండావాసులు పనిచేస్తున్నారు. పాఠశాల ఆవరణ, గ్రామపంచాయతీ ఆవరణ పూర్తిగా మొక్కలను నాటి రక్షణ చర్యలు చేపట్టారు. పల్లె ప్రగతిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీగార్డులను ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీళ్లు పడుతున్నారు.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్
మొక్కల సంరక్షణకు ప్రాధాన్యం
నేను వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను. తండాకు మొదటిసారి సర్పంచ్ అయ్యే అవకాశం వచ్చింది. పచ్చని చెట్లతో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు తండా పెద్దలతో రోడ్ల పక్కన, పాఠశాల ఆవరణలో మొక్కలను నాటాం. అవి ఏపుగా పెరిగి నీడనివ్వడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
– ధరమ్సింగ్, సర్పంచ్ నర్సపూర్తండా