ఆమనగల్లు, జూలై 31 : కల్వకుర్తిలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానికే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఎన్నికల సభలా ఈ బహిరంగ సభ ఉందని ఆయన మండిపడ్డారు.బుధవారం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడారు.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అంటే అందరికీ గౌరవం ఉందని, పార్టీలకు అతీతంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని గుర్తు చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని, బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చారని మండిపడ్డారు. ఇంతకు ఈ కార్యక్రమం అధికారిక కార్యక్రమమా.. పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఉన్నత స్థాయి అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారని, ఈ కార్యక్రమానికి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సబబేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ ప్రాంత అభివృధ్ధికి నీతినిజాయితీతో మాజీ కేంద్ర మంత్రి జైపాల్రెడ్డితో పాటు మాజీ మంత్రి మహేంద్ర నాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఎడ్మ కిష్టారెడ్డి, ద్యాప గోపాల్రెడ్డి పని చేశారని చేప్పిన రేవంత్రెడ్డి తను అవమానపరిచాడని మండిపడ్డారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా తాను మాజీ మంత్రిగా రాములు ఈ ప్రాంతానికి నీతి నిజాయితీగా పని చేయలేదా అంటూ విరుచుకుపడ్డారు. దాదాపు 5వేల కోట్లతో కల్వకుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని ఉద్ఘాటించారు.
కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి పథకానికి దాదాపు 35 వేల కోట్లు ఖర్చుపెట్టి 60 టీఎంసీల నీరు నిలువ ఉండేలా భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందని, పంప్హౌజ్ల నిర్మాణం కూడా పూర్తి చేసిన సంగతిని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాలువలు పూర్తి చేసి మూడు జిల్లాల రైతులకు దాదాపు 12.50లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉందని, ముందుగా కాల్వల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రాంత ప్రజలకు సేవలందించిన సూదిని జైపాల్రెడ్డి పేరును పాలమూరు- రంగారెడ్డి పథకానికి పెట్టాలని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేలా బడేభాయ్ అయిన పీఎం మోడీని ఒప్పించే బాధ్యత రేవంత్రెడ్డి తీసుకోవాలని జైపాల్యాదవ్ మరోమారు డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేకు ప్రాంత సమస్యలు, అభివృద్ధిపై కనీస అవగాహన లేదనిపిస్తుందని అన్నారు.
ఉంటే కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని మరిచి అవే పనులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అడగటం చూస్తుంటే నవ్వు వస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.కల్వకుర్తిలో 50 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిని కేసీఆర్ ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిగా మారుస్తూ 2023 జూన్ 28న 366 జీఓ ఇచ్చిందని, ఇందుకు సంబంధించి మూడు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసిందని, టెండర్ పూర్తయి పనులకు సంబంధించి గుత్తేదారు అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడని వివరించారు.
అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పనులకు శంకుస్థాపన చేసిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి కావాలని ఈ ప్రాంత ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కోరడంపై వ్యంగోక్తులు విసిరారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎస్సీ గ్రామాల రోడ్ల నిర్మాణాలకు, గ్రామీణ రోడ్డ అభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రగతిలో ఉన్నాయని, మళ్లీ అవే పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని అడగటం ఆశ్చర్యంగా అనిపించిందని అన్నారు.
ఏది ఏమైనా ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, పారిశ్రామిక కారిడార్, పాలిటెక్నికల్ తదితర అభివృధ్ధి పనులను అడిగితే.. టీవీలు చూస్తున్న తామందరం సంతోషించామని, తీరా రేవంత్రెడ్డి ఇరవై, ముప్పై కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి పుట్టిన గడ్డకు శూన్య హస్తం చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో రేవంత్రెడ్డికి ఇల్లు కూడా ఉంది.
ఈ ప్రాంతంలోనే చిన్నతనంలో ఆయన చక్కర్లు కొట్టారు.. అయినా ఈ ప్రాంతంపై ఆయనకు ఏమాత్రం ప్రేమలేదనే విషయం ఆయన విదిల్చిన వరాలు చూస్తేనే అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు జనార్దన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, బాలయ్య, చెన్నకేశవులు కౌన్సిలర్ సూర్యప్రకాశ్రావు, మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.