యాచారం, అక్టోబర్ 14 : మండలంలో పూల సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి. వరుసగా పండుగలు, శుభకార్యాలు రావడంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో రైతులు సాధారణ పంటలతో పాటుగా పూల సాగుపై మక్కువ చూపించారు. సాధారణ పంటల్లో నష్టాలు వచ్చినప్పటికీ పూల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సైతం రైతులకు రకరకాల పూల సాగుపై అవగాహన కల్పించారు
పూల సాగుపై మక్కువ..
మండలంలో రైతులు వివిధ రకాల పూల సాగు చేశారు. అర ఎకరా నుంచి ఎకరా విస్తీర్ణంలో పూల సాగు చేశారు. మండలంలోని చౌదర్పల్లి, మొండిగౌరెల్లి, ధర్మన్నగూడ, తమ్మలోనిగూడ, సింగారం, మేడిపల్లి, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో పూల సాగు చేశారు. ఆయా గ్రామాల్లో బంతి, చామంతి, కనకాంబరం, మల్లె, బొండు మల్లె, జాజిమల్లె, గులాబీ తదితర పూల పంట పండింది. డ్రిప్, స్ప్రింక్లర్ సిస్టంతో ఆధునిక పద్ధ్దతుల్లో పూల సాగును చేపట్టారు. తక్కువ నీరు, పెట్టబడితో ఎక్కువ లాభాలు వస్తుండడంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
భలే డిమాండ్..
పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఇటీవలే వినాయక చవితి, బతుకమ్మ సంబురాలు, దేవి నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగను పురస్కరించుకొని పూల క్రయ, విక్రయాలు ముమ్మరంగా కొనసాగాయి. త్వరలో దీపావళి, కార్తీకమాసం, మహాశివరాత్రి, అయ్యప్ప దీక్షలు, పెండ్లిళ్లు తదితర శుభకార్యాలు ఉండడంతో పూలకు మంచి గిరాకీ ఉండనున్నది. బంతి పూలు కిలో మామూలు సమయంలో రూ. 50 నుంచి 60 ఉండగా, పండుగల సీజన్లో రూ. 150 ధర పలుకుతుంది. కనకాంబరాలు సాధారణంగా కిలో రూ.400లు ఉండగా పండుగల సమయంలో రూ.1500ల ధరపలుకడం గమనార్హం. చామంతి మామూలుగా రూ.100 ఉండగా సీజన్లో రూ.400లు ధర పలుకుతుంది. సన్నజాజి పూలు సాధారణంగా కిలో రూ.80 ఉండగా సీజన్లో 350 ధర ఉంటుంది. మల్లె పూలు కిలో రూ. 400లు సాధారణంగా ఉంటే సీజన్లో సుమారు రూ.1000 ఉంటుంది. గులాబీ కిలో మామూలు సమయంలో కిలో రూ.60 ఉండగా సీజన్లో 300ల ధర పలుకుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
మంచి ఉపాధి..
రైతులు, వ్యాపారులు, చిరువ్యాపారులు, కూలీలకు పూలతో ఉపాధి లభిస్తున్నది. ఉదయం తెల్లవారుజామునే నేరుగా హైదరాబాద్కు తరలించి మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొంత మంది రైతులు తోటల వద్దే వ్యాపారులకు అమ్ముతున్నారు. కొంత మంది వ్యాపారులు చిరువ్యాపారులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇంటి వద్ద పూలదండలు అల్లుతున్న మహిళలకు కిలో రూ. 120నుంచి రూ.200ల వరకు ఇస్తుండడంతో వారికి ఉపాధి దొరుకుతున్నది. చిరు వ్యాపారులు పట్నంలోని కాలనీల్లో, గ్రామాల్లో తిరిగి కిలో పూలు అమ్మితే రూ.1000 నుంచి రూ.1200లు సంపాదిస్తున్నారు.
పూల సాగుతో లాభాలు..
పూల సాగుతో సీజనల్ సమయంలో మంచి లాభాలు వస్తున్నాయి. సాధారణ పంటలతో పోలిస్తే పండుగలు, శుభకార్యాల వంటి రోజుల్లో పూల సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. తోట నుంచి సేకరించిన పూలను పట్టణానికి రవాణా చేసి మార్కెట్లో అమ్ముతున్నాం. చిరువ్యాపారులకు తోట వద్దనే పూలను అమ్మి లాభాలను పొందుతాం.
– జుట్టు శ్రీశైలం రైతు, చౌదర్పల్లి
పూల వ్యాపారంతోనేజీవనోపాధి..
పూల వ్యాపారంతో నిత్యం తగిన ఉపాధి పొందుతున్నాం. రైతులు సాగు చేసిన పూల తోటల వద్ద పూలను కిలో లెక్కన కొనుగోలు చేస్తాం. పూలను కూలీలకు ఇచ్చి దండలు అల్లిస్తాం. పూలను హైదరాబాద్ తీసుకెళ్లి రోజూ కాలనీల్లో విక్రయిస్తాం. పండగల సమయంలో అధిక లాభాలు పొందుతాం. రోజు సుమారు వెయ్యి రూపాయలు సంపాదిస్తాం.
– మండలి జంగయ్య పూల వ్యాపారి, ధర్మన్నగూడ