మొదటి విడుత ‘దళితబంధు’తో ఎన్నో దళిత కుటుంబాలు ఆర్థికంగా రాణిస్తుండగా.. రెండవ విడుతలో మరింత మందికి లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈసారి నియోజకవర్గానికి 1100 చొప్పున యూనిట్లు అందించాలని నిర్ణయించగా.. లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఏర్పాటు చేస్తున్నది. ఒక్కో లబ్ధిదారుడికీ రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందించి పశు పోషణ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోళ్ల ఫామ్లు, రవాణా రంగాలకు సంబంధించిన యూనిట్ల ఏర్పాటుకు సహకరించనున్నారు. రెండో దఫాలో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,962 యూనిట్లు మంజూరయ్యాయి. దళితబంధు పథకం పర్యవేక్షణకుగాను నియోజకవర్గాలవారీగా ఇప్పటికే ప్రత్యేకాధికారులను నియమించారు.
-రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ) :‘స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేండ్లలో దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు పొందేందుకు తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టారు తప్పితే ఆయా కుటుంబాల్లో సమూల మార్పు కోసం ప్రయత్నం చేసిన వారు లేరు. కానీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగకముందే దళిత కుటుంబాలకు వరాలు ఇచ్చారు. నిధులు ఇచ్చి వారి ప్రగతికి హారం తొడుగుతున్నారు. మొదటి విడుతలో అమలు చేసిన ‘దళిత బంధు’తో దళిత జాతికి గొప్ప సాంత్వన చేకూరగా.. రెండో విడుతలో మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రెండో విడుతలో జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో 8,800 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. ప్రభుత్వ చర్యలతో దళిత కుటుంబాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.’
జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో..
రంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకం రెండో విడుతను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఒక్కో నియోజకవర్గంలో 1,100 మంది చొప్పున ఈ పథకా న్ని వర్తింపజేయనున్నారు. ఈ లెక్కన జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, తదితర నియోజకవర్గాల్లో 8,800 మంది దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. రెండో విడుత అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించిన తర్వాత సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హుల జాబితాను రూపొందించనున్నారు. సంబంధిత నివేదిక కలెక్టర్కు అందజేస్తారు. అనంతరం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. తుది జాబితా అనంతరం ఆయా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా రూ.10లక్షల చొప్పున జమ చేయనున్నది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మొదటి విడుత సాయంతో..
దళిత బంధు పథకం కింద మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గానికీ 100 మంది చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలో 697 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల చొప్పున రూ.69.70కోట్లను ఖాతాల్లో జమ చేసింది. ఈ డబ్బులతో పశు పోషణ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోళ్ల ఫారం, రవాణా రంగాలకు సంబంధించిన యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్నారు. అనతికాలంలోనే ఆయా కుటుంబాలు ఆర్థిక పురోగతి సాధించి ఉన్నత ప్రమాణాలతో జీవనం కొనసాగిస్తున్నారు. సొంత వ్యాపారాలు, చిన్న పరిశ్రమల ఏర్పాటుతో పది మంది కి ఉపాధి సైతం కల్పిస్తున్నారు.
నిరంతరం యూనిట్ల పర్యవేక్షణ
మొదటి విడుతలో ఏర్పాటు చేసుకున్న దళిత బంధు యూనిట్ల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆన్లైన్ పోర్టల్తోపాటు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా లబ్ధిదారులు యూనిట్ను ఎలా నడుపుకుంటున్నా రు..? ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి..! మధ్యలో యూనిట్ను నిలిపివేశారా..? తదితర అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నారు. రెండో విడుత దళిత బంధు పథకాన్ని సైతం పకడ్బందీగా అమలు చేసేందుకు నిరంతరం ఆన్లైన్ ద్వారా అధికారులు యూనిట్లను పర్యవేక్షించనున్నారు.
వికారాబాద్ జిల్లాలో షురూ..
వికారాబాద్ (నమస్తే తెలంగాణ): రెండో విడుత దళితబంధు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రెండో విడుత దళితబంధుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకంతో దళితులు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. అయితే రెండో విడుత దళితబంధు కింద నియోజకవర్గానికి 1,100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాకు రెండో విడుత దళితబంధులో 3,962 యూనిట్లు మంజూరు కాగా, వికారాబాద్ నియోజకవర్గానికి 1,100 యూనిట్లు, తాండూరు నియోజకవర్గానికి 1,100 యూనిట్లు మంజూరయ్యాయి. అయితే జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో ఉండడంతో పరిగి నియోజకవర్గానికి 881, కొడంగల్ నియోజకవర్గానికి 661 యూనిట్లు, అలాగే జిల్లా పరిధిలోని చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి 220 యూనిట్లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా యంత్రాంగం ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు సమాచారమిచ్చారు.
రెండో విడుతలో జిల్లాకు 3,962 యూనిట్లు…
దళితబంధు పథకం పర్యవేక్షణకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. వికారాబాద్ నియోజకవర్గంతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలానికి ప్రత్యేకాధికారిగా వికారాబాద్ ఆర్డీవో, తాండూరు నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా తాండూరు ఆర్డీవో, పరిగి నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా డీపీవో, కొడంగల్ నియోజకవర్గ ప్రత్యేకాధికారిగా డీఆర్డీవోను కలెక్టర్ నియమించారు. అలాగే మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, ఏపీఎంలు దళితబంధు దరఖాస్తులను పరిశీలించనున్నారు. అయితే జిల్లాకు మంజూరైన దళితబంధు యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలే ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన అనంతరం జిల్లా మంత్రి, కలెక్టర్కు జాబితాను అందజేయనున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తైన వెంటనే దళిత కుటుంబాల పేరిట బ్యాంకు ఖాతాను తెరువనున్నారు. తదనంతరం యూనిట్ల ఎంపిక ప్రక్రియ షురూ కానున్నది. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి యూనిట్లను జిల్లా యం త్రాంగం మంజూరు చేయనుంది. అయితే లబ్ధిదారులకు నచ్చిన యూనిట్ను ఎంపి క చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్కు సంబంధించి నైపుణ్యాన్ని పొందేందుకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించనున్నారు.
మరోవైపు లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10 వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారంలో కానీ ఇతరత్రా ఏదైనా నష్టమొచ్చినప్పుడు ఈ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకు రక్షణ నిధి ఏర్పాటుకు ప్రభు త్వం నిర్ణయించింది. జిల్లాలో ఎంపికైన లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా దళిత కుటుంబాలకు రూ.10 లక్షల్లో మంజూరు చేసే యూనిట్లకు సంబంధించి మినీ డైరీ, ట్రాక్టర్-ట్రాలీ, కోడి పిల్లల పెంపకం, వరి నాటు యంత్రం, పందిరి కూరగాయల సాగు, ఏడుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఆటో, ఆటో రిక్షా, సరుకు రవాణా ఆటో, ఐరన్ గేట్స్-గ్రిల్స్ తయారీ యూనిట్-ఆటో, కాంక్రీట్ మిశ్రమం తయారీ యంత్రం, సెంట్రింగ్, మట్టి ఇటుకల తయారీ-ఆటో ట్రాలీ, ఆయిల్ మిల్, బియ్యం, పసుపు గిర్నీ, మెడికల్, జనరల్ స్టోర్స్, మినీ సూపర్ బజార్, ఎలక్ట్రానిక్ పరికరాల అమ్మకం-సేవలు, ఎలక్ట్రికల్ షాప్-మోటార్ వైండింగ్-బ్యాటరీ సేవలు, హార్డ్వేర్-శానిటరీ దుకాణం, విత్తనాలు-ఎరువులు-క్రిమిసంహారక మందుల దుకాణం, వ్యవసాయ సాగుకోసం యంత్ర పరికరాల అమ్మకం, హోటల్-క్యాటరింగ్-ఆటోట్రాలీ, డీటీపీ-మీసేవా-సీఎస్సీ ఆన్లైన్ సెంటర్-ఫొటో స్టూడియో, డయాగ్నోస్టిక్ ల్యాబ్-మెడికల్ షాప్, టెంట్హౌస్-డెకరేషన్-లైటింగ్-సౌండ్ సిస్టం-ఆటోట్రాలీ తదితర యూనిట్లతోపాటు లబ్ధిదారులు కోరుకునే ఇతర యూనిట్లను మంజూరు చేస్తారు.
మొదటి విడుత లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు…
దళితబంధు పథకంలో భాగంగా మొదటి విడుతలో ప్రభుత్వం ఆర్థిక చేయూతనందించిన జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పని చేసి జీవనోపాధి పొందిన వారు.. దళితబంధు పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందజేయడంతో రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. అయితే దళితబంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసిన వారు… నేడు ఓనర్లయ్యారు. అయితే జిల్లాలో లబ్ధిదారులు మినీ డైరీ, పౌల్ట్రీపామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. అయితే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఇప్పటికే ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. అలాగే దళితబంధు లబ్ధిదారులు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోతే వారిని ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షల నిధులను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు మొదటి విడతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, 358 యూనిట్లకు సంబంధించి జిల్లా యంత్రాంగం గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. జిల్లాలో మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులు, తాండూరు నియోజకవర్గంలో 100, పరిగి నియోజకవర్గంలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.