రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి పాలకుల పాలనలో పల్లెల్లో పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఆ లక్ష్య సాధనలో సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనలేని అభివృద్ధికి బాటలు వేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత పల్లెల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులను సమకూరేలా ప్రణాళికలు చేశారు. ప్రధానంగా మనిషి చావుకు ఆరడుగుల స్థలం దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. అంతిమ సంస్కారాలకు గ్రామాల్లో స్థలాభావం ఉండేది. భూమి లేని పేదలు చనిపోతే దహన సంస్కారాల కోసం వారు పడిన అవస్థలు చెప్పనలవి కాదు. ఇలాంటి పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సమస్యలను వైకుంఠ ధామాలతో రూపుమాపింది. నేడు అలాంటి దుర్భర పరిస్థితులను దాటి రాగలిగాం.
గ్రామ గ్రామానికీ వైకుంఠ ధామం..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేడు ప్రతి గ్రామంలో ఓ వైకుంఠ ధామాన్ని ఏర్పాటు చేయించారు. ఒక వైకుంఠ ధామం అనేక కులాల ఆలోచనలను ఒక్కటిగా చేసింది. సామాజిక పరమైన సంస్కరణలకు తోడ్పాటును ఇచ్చింది. అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయాల్లో ఉత్తమమైన మార్పులను తెచ్చింది. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా సకల సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠ ధామాలు, ధనిక, పేద, ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా ప్రతి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు సగౌరవంగా అందించే అవకాశాన్ని వైకుంఠ ధామాలు కల్పిస్తున్నాయి. ఒకప్పుడు అంత్య క్రియలు నిర్వహించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న గ్రామాల్లో సైతం ఇప్పుడు అలాంటి బాధలు తప్పిపోయాయి. శ్మశానానికి వెళ్లే దారి లేక, పాడె దింపే స్థలం లేక అనేక అవస్థలు పడిన ప్రాంతాల్లోనూ దయనీయమైన పరిస్థితులు కనుమరుగయ్యాయి. అంత్యక్రియలకు కావాల్సిన కట్టెలు, స్నానాలు చేయడానికి నీళ్లు, బాత్రూమ్లు, బోర్లు పని చేయడానికి కరెంట్, కర్మకాండలకు అనువైన వేదికలు ఇలా అన్నీ సౌకర్యాలతో పల్లెల్లో వైకుంఠ ధామాలు రూపుదిద్దుకున్నాయి.
జిల్లాలోని 558 గ్రామాల్లో..
రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ వైకుంఠ ధామం నిర్మించేలా జిల్లా అధికార యం త్రాంగం ఏర్పాటు చేసింది. 2017 నుంచి మొదలైన నిర్మాణ ప్రక్రియ రూ.10.50లక్షల అంచనాతో 2019 వరకు కొనసాగింది. అనంతరం, రూ.12 లక్షల అంచనాతో 2021 వరకు తదుపరి నిర్మాణాల ప్రక్రియ కొనసాగింది. 141 నిర్మాణాలను డీపీఆర్ఏ నిధులు, 417 నిర్మాణాలను పంచాయతీ రాజ్ శాఖ నిధుల ద్వారా నిర్మించారు. 141 నిర్మాణాలు ఒక్కొక్కటి రూ.10.50లక్షలతో నిర్మాణ పనులను పూర్తి చేశారు. 417 నిర్మాణాలు ఒక్కొక్కటి రూ.12 లక్షలతో నిర్మించారు. వైకుంఠ ధామాల నిర్మాణం మొత్తం రూ.64 కోట్ల 84 లక్షల 50 వేలతో పకడ్బందీగా పూర్తయ్యాయి. ప్రతి వైకుంఠ ధామానికి దింపుడు కళ్లం, ఒక బోరు బావి, విద్యుత్, లైట్లు, స్నానాల గదులు, ట్యాపులు, విశ్రాంతి గది వసతులను కల్పించారు. వాటి నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
ప్రజలకు అందుబాటులోనే..
గతంలో ఏ గ్రామంలో చూసినా అంత్యక్రియల కోసం స్థలాలను వెతుక్కునే పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ఏ పాలకులు చేయని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారు. రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామాల్లో 558 వైకుంఠ ధామాలను రూ.64 కోట్ల 84 లక్షల 50 వేలతో పకడ్బందీగా నిర్మించాం. ప్రస్తుతం ఊరూరా అన్ని వసతులను కల్పించాం. ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలి.
– ప్రభాకర్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి, రంగారెడ్డి
సకల సౌకర్యాలతో..
పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సకల సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకు ముందు గ్రామాల్లో నిరుపేదలు చనిపోతే బొందపెట్టే జాగా లేక కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడేటోళ్లు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు వైకుంఠ ధామాల ఏర్పాటుతో కుల, మత భేదాలు లేకుండా అందరి దహన సంస్కారాలు అందులోనే జరుగుతున్నాయి. ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు ప్రభుత్వం వైకుంఠ ధామాలు నిర్మించడం హర్షణీయం.
– మాడమోని సావిత్రి, సర్పంచ్, తొమ్మిది రేకుల, కేశంపేట
సమస్యలు దూరం
ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాల్ని నిర్మించడంతో భూమి లేని నిరుపేదలు, సంచార జాతుల ప్రజల సమస్యలు తీరాయి. భూమి లేని పేదలు చనిపోతే దహన సంస్కారాల కోసం వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితులను గమనించిన తెలంగాణ ప్రభుత్వం వారి సమస్యలను వైకుంఠ ధామాలతో రూపుమాపింది. ఏది ఏమైనా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పనులు తెలంగాణ ప్రభుత్వం చేసింది. సీఎం కేసీఆర్ ప్రజల యోగ క్షేమాలను తెలుసుకొని, జనం ఎలాంటి కష్టాలు పడుతున్నారో వాటిని ప్రభుత్వ పరంగా తీరుస్తున్నారు. – ముడావత్ శశికళ, పొలగోని గుట్ట తండా
స్థల కొరత తీరింది..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠ ధామాల నిర్మాణంతో శ్మశాన వాటికల స్థల కొరత తీరింది. గ్రామంలో ఒకప్పుడు శ్మశాన వాటికలకు స్థలం లేక శవాలను ఖననం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామంలో కుల, మత, జాతి అనే భేదాలు లేకుండా ఒకే చోట శవాలను ఖననం చేయడంతో అనేక సమస్యలు తొలగిపోయాయి. గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. వైకుంఠ ధామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తా.
– కంబాలపల్లి ఉదయశ్రీ, సర్పంచ్, నంది వనపర్తి, యాచారం మండలం
స్నానపు గదులు సైతం నిర్మాణం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాల్లో ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించారు. శవాలను దహనం చేసేందుకు రెండు శ్మశాన వాటికలు, అక్కడే స్నానపు గదులు, మంచినీరు, విద్యుత్ సౌకర్యం, విశ్రాంతి గది, దింపుడు కళ్లాలు ఒకేచోట నిర్మించడంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వైకుంఠ ధామంతో స్థల కొరతతో పాటు జాతి మత కుల భేదాలు లేకుండా ఒకేచోట అంత్య క్రియలు చేసే అవకాశం లభిస్తున్నది. గ్రామంలో నిర్మించిన వైకుంఠ ధామాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
– డేరంగుల రాజు, సర్పంచ్, నల్లవెల్లి