ఎకరాకు రూ.4వేలు ప్రోత్సాహకం అందించనున్న ప్రభుత్వం
వికారాబాద్ జిల్లాలో 848 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక
నూజివీడు, రాశి కంపెనీల ప్రతినిధులతో వ్యవసాయాధికారులకు ప్రత్యేక శిక్షణ
పరిగి, జూన్ 28 : అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని సర్కారు సూచించడంతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానంలో పత్తి సాగుకు నిర్ణయించింది. ఇందుకుగాను సర్కారు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం ద్వారా రైతులు సైతం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 2.25లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుకు 848 ఎకరాలను ఎంపిక చేశారు. గతంలో 500 ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రణాళిక రూపొందించగా.. దాన్ని 848 ఎకరాలకు పెంచారు. ఈ విధానంలో పత్తి సాగుకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు రూ.4వేలు ప్రోత్సాహకంగా అందించేందుకు నిర్ణయించింది. దీంతో రైతులు సైతం ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు.
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు
ఈ వాన కాలంలో జిల్లా పరిధిలో 848 ఎకరాల్లో అధిక సాంద్రతలో పత్తి సాగుకు వ్యవసాయాధికారులు నిర్ణయించారు. తేలిక నేలలు, ఎర్ర నేలలు, చెల్క నేలల్లోనే ఈ విధానంలో పత్తి సాగు చేపడుతారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ విధానంలో సాగు కోసం నూజివీడు, రాశి రెండు కంపెనీలకు సంబంధించిన విత్తనాలు అందిస్తారు. కొత్త విధానంలో పత్తి సాగుపై ఇప్పటికే ఆయా కంపెనీల ప్రతినిధులు వ్యవసాయాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఎకరాకు రూ.4వేలు ఆర్థిక ప్రోత్సాహం
పంటల సాగు కోసం రైతులకు ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సాయంగా రైతుబంధు కింద అందజేస్తున్న ప్రభుత్వం అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.4వేలు అందించనుంది. ఇందులో విత్తనాల కోసం రూ.2187, 45 రోజులు, 65 రోజుల సమయంలో పంటపై స్ప్రే చేసే మెపిక్వాడ్ క్లోరైడ్ కోసం రూ.500, పంట సాగుకు భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.1000, ఇతర ఖర్చుల కోసం రూ.313 మొత్తం రూ.4వేలు ప్రోత్సాహకంగా రైతులకు అందజేస్తారు. రైతులు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేపట్టిన తర్వాత ఈ పొలాలను వ్యవసాయ విస్తరణాధికారులు సందర్శించి సంబంధిత రైతు ఎన్ని ఎకరాల్లో పత్తి సాగు చేశారనేది నిర్ధారించి ఆన్లైన్లో ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ విస్తరణాధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేపట్టిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.4వేలు ప్రోత్సాహక డబ్బులు జమవుతాయి. ఈ విధానంలో పత్తి సాగుకు సంబంధించి అవసరమైన పత్తి విత్తనాలను ఆయా కంపెనీల డీలర్ల వద్ద నిలువ ఉంచారు. ఎంపిక చేసిన రైతులకు ఎన్ని ఎకరాలకు, ఎంత మొత్తంలో పత్తి విత్తనాలు అవసరమనేది ఏఈవో పర్మిట్ రాసిస్తేనే అందుకనుగుణంగా విత్తనాలు ఇస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో పత్తి సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. వారికి వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు తగు సూచనలు చేస్తూ కొత్త విధానంలో పత్తి విత్తనాలు నాటడాన్ని స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం
– డి.ఎస్.లక్ష్మీకుమారి, ఏడీఏ, పరిగి
అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అన్ని మండలాల్లో ఎంపిక చేసిన రైతులతో ప్రత్యేక సమావేశాలు జరిపి సాగు విధానాలను వివరించాం. నూజివీడు, రాశి కంపెనీల డీలర్ల వద్ద విత్తనాలు ఉన్నాయి. ఏఈవోలు రాసిచ్చే పర్మిట్ల ఆధారంగా విత్తనాలు ఇస్తారు. సాగు చేస్తున్న సమయంలో వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులు దగ్గరుండి పరిశీలించి, రైతులకు తగు సూచనలు చేస్తారు. ఈ విధానంలో దిగుబడి ఎక్కువగా వస్తుంది. పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు దిగుబడి పెరిగి ఆదాయం పెరుగుతుంది. రెండో పంట సాగు చేసుకునే అవకాశం కలుగుతుంది.