ప్రభుత్వ సూచనల మేరకు చాలామంది అన్నదాతలు పత్తి సాగుకే మొగ్గు చూపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వేసిన పంటల్లో 70 శాతం పత్తి పంటనే సాగు చేశారు. ఇప్పటికీ 3లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో 2 లక్షల ఎకరాల్లో పత్తి పంటనే సాగు చేశారు. మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్పై అధికారులు చేసిన విస్తృత ప్రచారం ఫలించింది. వానకాలానికి సంబంధించి జిల్లాలో మొత్తం 4లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. జిల్లావ్యాప్తంగా 65వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. అలాగే ఇప్పటివరకు 20,628 ఎకరాల్లో వరి సాగైంది. ఇంకా సమయం ఉన్నందున వరిసాగు మరో లక్ష ఎకరాలకు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం రెండు లక్షల ఎకరాలు దాటింది. ప్రభుత్వం వానకాలం ప్రారంభం నుంచే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విస్తృత ప్రచారం సత్ఫలితాలను ఇచ్చింది. పత్తికి డిమాండ్ అధి కం గా ఉండటంతో రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం సూచించడంతోపాటు అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టింది. అయితే ప్రతి ఏటా జిల్లాలో రికార్డు స్థాయిలో పత్తి పంట సాగవుతున్న మాడ్గుల మండలంలో ఈ వానకాలంలోనూ అధిక మొత్తంలో పత్తి పంటను రైతులు సాగు చేశారు.
జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట ఇప్పటివరకు సాగు కాగా..ఇందులో ఒక్క మాడ్గుల మండలంలోనే 51వేల ఎకరాల వరకు సాగైంది. మరోవైపు జిల్లాలో వానకాలానికి సం బంధించి వరి సాగు మినహా మిగతా పంటలకు అదును దాటింది. వరిని ఈనెలాఖరు వరకు సాగు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నా రు. ఇప్పటివరకు 20 వేల ఎకరాల్లో వరి పంట సాగుకాగా, ఈనెలాఖరులోగా మరో లక్ష ఎకరాల వరకు వరి సాగు పెరుగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా క్షేత్రస్థాయిలో రైతులవారీగా వివరాలను సేకరించిన ఏఈవోలు ఇప్పటివరకు 2,54,638 ఎకరాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఆయా పంటల సాగు మూడు లక్షల ఎకరాల వరకు సాగైనట్లు జిల్లా వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
ఆయా పంటల సాగు.. మూడు లక్షల ఎకరాల్లో
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మూడు లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. 2,54,638 ఎకరాల వరకు ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయగా అందు లో.. పత్తి-1,48,421 ఎకరాలు, కంది-15,533 ఎకరాలు, వరి-20,628 ఎకరా లు, మొక్కజొన్న 64,239 ఎకరాలు, జొన్న 2,877 ఎకరాలు, పెసర్లు 79 ఎకరాలు, వేరుశనగ-2 ఎకరాలు, ఆముదం 6 ఎకరాలు, సోయాబీన్ 25 ఎకరాలు, ఇతర పంటలు 2,797 ఎకరాల్లో నమోదయ్యాయి.
రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు..
జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో 70 శాతం మేర పత్తి పంట ఉన్నది. ఈ వానకాలంలో పత్తి పంటను అధిక మొత్తంలో పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అంతటా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పత్తికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతోపాటు చైనా, బ్రెజిల్ తదితర దేశాల్లో పత్తి సాగు తగ్గడంతో పంటకు డిమాండ్ పెరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలనే ఉద్దేశంతో పత్తి సాగు పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని మాడ్గుల మండలంలో అత్యధికంగా పత్తి పంటను అక్కడి రైతులు సాగు చేశారు. అయితే పత్తి పంట ఇప్పటివరకు సుమారు రెండు లక్షల వరకు సాగుకాగా.. 1,48,421 ఎకరాల వరకు ఆన్లైన్లో పొందుపర్చారు. వాటిలో మాడ్గుల మం డలంలో 51 వేల ఎకరాలు, కొందుర్గులో 13,700 ఎకరాలు, షాబాద్లో 10,500 ఎకరాలు, చౌదరిగూడెంలో 9,530 ఎకరాలు, ఆమనగల్లులో 9,250 ఎకరాలు, తలకొండపల్లిలో 8,300 ఎకరాలు, కేశంపేటలో 7,550 ఎకరాలు, యాచారంలో 6,670 ఎకరాలు, చేవెళ్లలో 5,200 ఎకరాలు, మహేశ్వరంలో ఐదు వేల ఎకరాలు, ఫరూఖ్నగర్లో 4,350 ఎకరా లు, నందిగామలో 3,805 ఎకరాలు, కొత్తూరులో 3,876, మంచాలలో 2,610 ఎకరాలు, శంకర్పల్లిలో 2,420 ఎకరాలు, మొయినాబాద్ మండలంలో 1,850 ఎకరాల పత్తి సాగు వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు.
అంచనాలకు మించి మొక్కజొన్న సాగు..
ఈ వానకాలంలో మొక్కజొన్న పంట వ్యవసాయాధికారుల అంచనాలకు మించి సాగయ్యిం ది. జిల్లాలో ఈ ఏడాది 48 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 64,239 ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అత్యధికంగా కేశంపేట మండలంలో 14,150 ఎకరాలు, ఫరూఖ్నగర్ లో 8,300 ఎకరాలు, కొందుర్గులో 6,540 ఎకరాలు, తలకొండపల్లిలో 5,920ఎకరాలు, చౌదరిగూడెంలో 4,515, షాబాద్లో 9,500 ఎకరాలు, శంకర్పల్లి మండలంలో 3,450 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయ్యింది.