ములుగు, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ‘రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదేం కాదు’ అంటూ న్యాయమూర్తిపై ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ధిక్కార ధోరణిని ప్రదర్శించడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. సదరు సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ములుగు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ములుగు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మహిళా న్యాయమూర్తి గురువారం కోర్టు వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో సీఐగా పనిచేస్తున్న బీ నరహరి ఓ కేసులో దర్యాప్తు అధికారిగా సాక్ష్యం చెప్పేందుకు ఇదేరోజు మధ్యాహ్నం నిర్లక్ష్యంగా కోర్టు హాలులోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్టు న్యాయవాదులు తెలిపారు. న్యాయమూర్తిపై కనీస గౌరవం చూపకుండా చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పారు. ఆయన తీరుతో కోర్టులో ఉన్న ఏపీపీతో పాటు న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని వాపోయారు.
సదరు సీఐ ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసినప్పుడు 2018 నుంచి 2021 వరకు ఐదు కేసుల్లో దర్యాప్తు అధికారిగా ఉండగా సాక్ష్యం చెప్పేందుకు కోర్టులో హాజరు కానందున సీఐపై నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని వివరించారు. సీఐ కోర్టు హాలులోకి వచ్చిన సమయంలో న్యాయమూర్తి రెండు కేసుల్లో ఉన్న వారెంట్లను కోర్టు నిబంధనల ప్రకారం రద్దు చేయించుకోవాలని సూచించారని చెప్పారు. దీనికి సీఐ సమన్లు జారీ చేయకుండా కోర్టు అలాంటి ఆదేశాలు ఇవ్వకూడాదని సమాధానం ఇచ్చారని, కోర్టు ఆదేశాలు పాటించడానికి బదులుగా కోర్టు అధికారాన్ని సీఐ ప్రశ్నించారని వివరించారు. న్యాయస్థాన ప్రిసైడింగ్ ఆఫీసర్తో అహంకారపూరితంగా వాదనకు దిగి కోర్టు పట్ల అగౌరవ వైఖరి ప్రదర్శించారని తెలిపారు. సీఐని ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తున్నారని కోర్టు ప్రశ్నించగా కామారెడ్డి ఎస్పీ పరిధిలో పనిచేస్తున్నానని సమాధానం ఇస్తూ ‘మీరు చేయగలిగినది ఏమైనా చేసుకోండి’ అంటూ ధిక్కార ధోరణిలో సమాధానం ఇచ్చారని చెప్పారు.
కోర్టు హాలు నుంచి బయటకు వెళ్తూ ‘కోర్టు, న్యాయవ్యవస్థ అత్యున్నతమైనవేం కావు’ అంటూ వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారని తెలిపారు. కోర్టు హాలులో ఘటన జరిగిన సమయంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీఐని నియంత్రించేందుకు ప్రయత్నించకుండా మౌనంగా ఉన్నారని చెప్పారు. సీఐ ప్రవర్తన కోర్టు గౌరవానికి భంగం కలిగించేలా ఉండటంతో పాటు న్యాయవాదుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చారని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగినవారిని అదుపు చేయకపోతే అది న్యాయపాలన, న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తప్పు చేసిన సీఐపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రయ్య, న్యాయవాదులు వినయ్కుమార్, సునీల్ కుమార్, భిక్షపతి, రవీందర్ పాల్గొన్నారు.