ముంబై, ఆగస్టు 7: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రెండు రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీలు.. తిరిగి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఇతర ఆర్థిక షేర్లలో పెట్టుబడులను మదుపర్లు ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర మళ్లీ 80 డాలర్ల ఎగువకు చేరడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 455.59 పాయింట్లు లేదా 0.58 శాతం పతనమై 78,499.17 వద్ద ముగిసింది. నిఫ్టీ 65.35 పాయింట్లు లేదా 0.27 శాతం క్షీణించి 24,570.65 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలోనైతే 113.25 పాయింట్లు కోల్పోయింది.
సెన్సెక్స్ షేర్లలో..
బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 5.90 శాతం నష్టపోయింది. బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లూ మదుపర్లను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. రంగాలవారీగా ఆర్థిక సేవలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హౌసింగ్ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సూచీలు 1.33 శాతం నుంచి 0.61 శాతం వరకు మదుపర్లకు నష్టాలను పంచాయి. అయితే బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్లు 0.20 శాతం, 0.19 శాతం పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో..
హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణాకు సంబంధించి జరుగుతున్న సంప్రదింపుల్లో మళ్లీ ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఈ క్రమంలోనే ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్ సూచీలు నష్టపోయాయి. ఇక హౌతీల దాడులతో మిడిల్ ఈస్ట్ దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే.