Cheaque Power | జహీరాబాద్, సెప్టెంబరు 16: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామ సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సర్పంచ్ చెక్ పవర్ను నెల రోజుల పాటు నిలిపివేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. అక్టోబరు 6, 2026 వరకు గుంజోటి గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.
న్యాల్కల్ మండలం గుంజోటి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్డు పనుల బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ చెక్ పవర్ను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన తరఫున న్యాయవాది ఏ. సంతోష్కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్ ఉత్తర్వులు పంచాయతీరాజ్ చట్టానికి, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరపకుండానే చెక్ పవర్ నిలిపివేశారని వాదించారు.
పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు.. కలెక్టర్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించినట్లు సర్పంచ్ వర్గాలు తెలిపాయి. అలాగే అక్టోబరు 6 వరకు గుంజోటి గ్రామ అభివృద్ధి పనుల్లో కలెక్టర్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Deshetty Patil
హైకోర్టు ఆదేశాలపై సర్పంచ్ బొమ్మ దేశెట్టి పాటిల్ స్పందించారు. పారదర్శకంగా పనిచేస్తున్న తమపై ఓర్వలేక ప్రత్యర్థులు తప్పుడు ఫిర్యాదులు చేసి అధికారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. చివరకు ధర్మమే గెలిచిందని, న్యాయస్థానం తమకు న్యాయం చేసిందని అన్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.