రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ) : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడ గ్రామంలో భూబాధితులకు ప్రభుత్వం భరోసా ఇవ్వటంలేదంటూ రైతులు వాపోతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న తమ భూములను ప్రభుత్వం పండ్ల మార్కెట్ ఏర్పాటు పేరుతో బలవంతంగా తీసుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను తీసుకోవద్దంటూ ఆందోళనకు దిగిన రైతులను పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుం డా తమ భూముల్లోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించటంలేదని, తమను దొంగల్లా చూస్తున్నారని పేర్కొంటున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం పండ్ల మా ర్కెట్ కోసం ఎలాంటి వివాదాల్లేని 178 ఎకరాల భూమిని కేటాయించగా.. రేవంత్ సర్కార్ ఆ భూమిని ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో టీజీఐఐసీకి అప్పగించింది. అందుకోసం కొహెడలోని సర్వేనంబర్ 167/1లోని భూమిని కేటాయించిగా.. తాము కబ్జాలో ఉండి తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం పండ్ల మార్కెట్కు కేటాయించడంతో ఆ విషయం తెలిసినప్పటి నుంచే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
కొహెడలోని సర్వేనంబర్ 167/1లో గల 239 ఎకరాల భూములను ప్రభుత్వం పండ్లమార్కెట్కు కేటాయించింది. అందులో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొంత భూమి పోగా ఆలయం పేరుతో మరికొంత భూమి ఉన్నది. మిగిలిన భూమిపై సెక్షన్ 9 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హక్కులున్నాయి. కాగా, రైతులు తమ భూములు తమకే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ భూమిలో తమ వాటా ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా..ఈ వివాదం న్యాయస్థానంలో నడుస్తున్నది. వీటిని పట్టించుకోని రేవంత్ సర్కార్ పండ్ల మార్కెట్ కోసం అందులోని 178 ఎకరాలు కేటాయిస్తున్నట్టు జీవోను జారీచేసింది.
జీవోను జారీ చేయటమే కాకుండా పండ్లమార్కెట్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే నెల 3న పండ్ల మార్కెట్ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాగా, కొన్నేండ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్న భూములను ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకుండా ఎలా తీసుకుంటుందని రైతులు పండ్ల మార్కెట్ చదును పనులను సోమవారం అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం మంగళవారం తెల్లవారుజామున సుమారు 50 నుంచి 60 మంది రైతులు, మహిళలు, వృద్ధులను బలవంతంగా పోలీసులతో అరెస్టు చేయించి నాగోల్ ఠాణాకు తరలించింది. అక్కడ వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో ప్రభుత్వ వైఖరిని రైతులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
కాగా, పండ్ల మార్కెట్కోసం తీసుకుంటున్న భూమిలో అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని ఇప్పటికే కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రం గారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో రెండుమూడు రోజుల్లో అర్హులైన రైతులను గుర్తిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆ ప్రక్రియ ముందుకే సాగలేదు. ఎంత మంది రైతులకు ఏక్సాల్ పట్టాలున్నాయి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. కాగా, విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండ టంతో తమకు న్యా యం జరుగుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.
కొహెడ గ్రామంలోని సావుకారిగుట్ట పరిసర ప్రాంతంలోని స్థలానికి అధికారులు ఎప్పుడో తమ కుటుంబీకులకు సర్టిఫికెట్లు ఇచ్చారు. కాగా, సర్కార్ ఈ భూములను పండ్ల మార్కె ట్కు కేటాయించింది.. తమ నుంచి బలవంతంగా ఇవ్వాలని చూస్తున్నది.
-లక్ష్మమ్మ, బాధిత మహిళా రైతు కొహెడ
ప్రభుత్వం కొన్నేండ్ల కిందటే పట్టాలివ్వడంతో ఆ భూములు సాగుచేసుకుని జీవిస్తున్నాం. కానీ, కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు తమ భూములను బలవంతంగా తీసుకుని తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. వెంటనే ప్రభుత్వంతోపాటు కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలి.
-సాదు మహేశ్, కొహెడ