షాబాద్, మార్చి 31: ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, మందులు అందజేస్తున్నారు. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 13,363 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 825 మందికి కంటి అద్దాలు అందజేశారు. 713 మందికి ప్రిస్క్రిస్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని వైద్యసిబ్బంది చెబుతున్నారు.
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించి న కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకు నేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్ల అద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5,532 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 716 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 858 మందికి అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 285 గ్రామాలు, 58 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.