షాబాద్, మార్చి 21 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,412 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,164 మందికి కంటి అద్దాలు అందజేశారు. 1,010 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవసరమున్నవారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. వంద రోజుల పాటు నిర్వహించే ఈ రెండో విడుత కంటి వెలుగును విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
250 గ్రామాలు, 52 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం జిల్లాలో 4745 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 605 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 628 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 250 గ్రామాలు, 52 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.