సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్చే మార్పులకనుగుణంగా మామిడి సాగు, దిగుబడి పెరిగేలా ప్రయోగాలు చేస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ అన్నారు. మామిడి సాగులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉందని ఆమె పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం(ఎఫ్ఆర్ఎస్)లో మంగళవారం మామిడి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మామిడి రైతులకు సలహాలు, సూచనలు చేశారు. 265 రకాల మామిడి పండ్లు, కాయలను ప్రదర్శనలో పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ దేశాలకు 40శాతం మామిడి పండ్లు భారతదేశం నుంచే ఎగుమతి అవుతున్నాయన్నారు. మామిడి ఉత్పత్తి శక్తిని పెంచుకుంటే అధిక లాభాలు వస్తాయని, మామిడి రైతులు వివిధ దేశాలకు పండ్లను ఎగుమతి చేసుకొని ఆర్థికంగా ఎదుగాలన్నారు. రాష్ట్రంలో 2.51 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతున్నదని, ఎకరాకు 3-4 టన్నుల కాయలు కాస్తున్నట్లు తెలిపారు. వాతావరణంలో వచ్చే మార్పులతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని, మార్పులను ఎదుర్కొని దిగుబడి పెంచేలా శాస్త్రవేత్తల పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఫలాలను కేవలం 2శాతం వరకే తీసుకుంటున్నారని, ఈ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేయడంలో రైతులు వెనుకబడి ఉన్నారని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కిరణ్కుమార్, డాక్టర్ ఎ.భగవాన్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సునీత, ఎఫ్ఆర్ఎస్ శాస్త్రవేత్త రాజుకుమార్ పాల్గొన్నారు.