వికారాబాద్ జిల్లాకు తాగు, సాగు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఊపందుకోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు నీటిని అందించేందుకు 100 కిలోమీటర్ల కాలువల తవ్వకం పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకు అధికారులు రూ.5,180 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి నివేదికగా అందించగా.. నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ నిధులను మంజూరు చేస్తూ ఫైల్పై సంతకం చేశారు. కాగా సోమవారం నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలకు తాగు, సాగు నీటిని అందించేందుకు కాలువల తవ్వకానికి తక్షణమే టెండర్లు పిలిచి పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కానుకుర్తి వద్ద ప్రత్యేకంగా రిజర్వాయర్ను నిర్మిస్తే నియోజకవర్గంలోని మెజార్టీ ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించొచ్చని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి.. కాలువల ద్వారా కోట్పల్లి ప్రాజెక్టును నింపాలని వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్రెడ్డిలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వికారాబాద్, మే 1, (నమస్తే తెలంగాణ): జిల్లాకు తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5180 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిధులను మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 2015లోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా, ఏపీతోపాటు ప్రతిపక్ష పార్టీలు కేసులు వేయడంతోపాటు పనులు నిలిచిపోయాయి. ఇటీవల తాగునీటికి సంబంధించిన పనులు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతులివ్వడంతో పనులు జోరందుకున్నాయి. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు అందించనున్న తాగునీటికి సంబంధించి కాలువల నిర్మాణ పనులను త్వరలోనే చేపట్టనున్నారు. సోమవారం సీఎం అధ్యక్షతన నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిర్వహించిన సమావేశంలో పనులకు సంబంధించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఉద్దండపూర్ నుంచి వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకుగాను కాలువల నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టేలా జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులకు సూచించారు. వీలైనంతా త్వరగా కాలువల నిర్మాణ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తుంది.
జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు నిర్మించనున్న కాలువల నిర్మాణానికి తక్షణమే టెండర్లను పిలువాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగునీటిని అందించేందుకు 100 కిలోమీటర్ల కాలువలను నిర్మించనున్నారు. కాలువల నిర్మాణ పనులకు జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మొదట ఉద్దండపూర్ వద్ద కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. కాలువల ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని దాదాపు 1000 చెరువుల వరకు నీటిని నింపేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఉద్దండపూర్ రిజర్వాయర్కు తరలించనున్నారు. నీటిని అందించేందుకు అనుమతులు వచ్చిన వెంటనే 100 కిలోమీటర్ల వరకు నిర్మించనున్న ఎడమ కాలువ కింద జిల్లాలోని సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుంది. జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ వరకు తాగు, సాగు నీటిని అందించనున్నారు. పరిగి నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు, తాండూరు నియోజకవర్గంలోని 1,02,797 ఎకరాలకు, వికారాబాద్ నియోజకవర్గంలోని 89,287 ఎకరాలకు, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలంలోని 900 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. ఉద్దండపూర్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు, కరివెన నుంచి జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కోస్గి, తదితర మండలాలకు తాగు, సాగు నీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని కానుకుర్తి వద్ద ప్రత్యేకంగా రిజర్వాయర్ను నిర్మించాలని, దీంతో కొడంగల్ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించవచ్చని కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, అదేవిధంగా కాలువల ద్వారా కోట్పల్లి ప్రాజెక్టును నింపాలని వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్రెడ్డిలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.