న్యూఢిల్లీ: ఏఐ రాకతో ఉద్యోగాల కోతపై వస్తున్న హెచ్చరికలు బెడిసికొట్టాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. రీడ్ హాఫ్మన్ నిర్వహించిన ‘పాజిబుల్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ ప్రయోజనాలను సమర్థవంతంగా వివరించడంలో పరిశ్రమ విఫలమైందన్నారు. దీనివల్ల ప్రజల్లో అనుమానాలు, వ్యతిరేకత పెరిగాయన్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు, నాలెడ్జ్ వర్కర్ల ఉపాధి పూర్తిగా పోతుందని ప్రచారం చేస్తూనే,ఆ టెక్నాలజీని మేం అభివృద్ధి చేస్తున్నామని ఎవరైనా అంటే ఎందుకు స్వాగతిస్తారు? అని నాదెళ్ల ప్రశ్నించారు. ఈ రకమైన ప్రచారం వల్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, కాలేజీ వార్షికోత్సవాల్లో ఏఐ ప్రస్తావన వచ్చినప్పుడు విద్యార్థులు నిరసన తెలిపే స్థాయికి పరిస్థితి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు.