నాడు తాగునీటి కోసం తండ్లాట
Mission Bhagiratha | ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాలో పని చేయని చేతి పంపులు కనిపించేవి. మహిళలు ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కి చేసే ఆందోళనలు నిత్యకృత్యం. పగటి పూట వ్యవసాయ బావుల వద్దకు వెళితే రైతులు తిడుతారన్న భయంతో రాత్రిళ్లు జాగారం చేసి కిలో మీటరు దూరం నడిచి నీళ్లు తెచ్చుకునేవారు. పనులు మానుకుని వ్యవసాయ బోరు వద్ద నీటి కోసం గుమిగూడి తండా వాసులు పడుతున్న పాట్లు ఈ చిత్రంలో చూడవచ్చు.
నేడు ఇంటి ముందుకే స్వచ్ఛమైన తాగునీరు
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఫొటో కూడా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాలోనిది. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజల దాహార్తిని తీర్చడానికి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. తండాలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడంతో ప్రజల తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ఏ బాదరబందీ లేకుండా ఇంటి ముందున్న నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని పట్టుకుంటున్నారు. ఏడాది పొడవునా ఎప్పుడంటే అప్పుడు నీళ్లు వస్తున్నాయని, తమ తండాకు నీటి కష్టాలు దూరమయ్యాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.